‘పవన్’ మద్దిస్తం… హిట్టా, ఫట్టా..!తిరుపతి అభ్యర్థి ‘చిచ్చు’ ఆరినట్లేనా..!అధినేతలు బుజ్జగించినా ‘పట్టు’గానే నేతలుప్రచారానికి దూరంగానే అసమ్మతిప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ‘వైసిపిలో సీటు లేదు పొమ్మంటే, వెంటనే జనసేన కండువా కప్పుకున్న వ్యక్తికి ఉన్నపళంగా సీటివ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది.. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తిరుపతి నాయకత్వం అభ్యర్ధిత్వానికి పనికిరాలేదా..? పార్టీ కష్టాల్లో ఉన్నపుడు కాపాడింది మేం కాదా..? వైసిపి నిర్బంధాలను ఎన్నిసార్లు ఎదుర్కొన్నాం.. పొత్తులో భాగంగా జనసేనకు తిరుపతి ఇచ్చారు.. సరే.. చిత్తూరు నుంచి ఆరణి శ్రీనివాసులును తీసుకొచ్చి అభ్యర్ధిత్వం ఇవ్వాల్సిన అత్యవసరం ఏమొచ్చింది.. తిరుపతి నాయకత్వం అంత పనికిరాకుండా పోయిందా’ అన్నదే అసమ్మతి నేతల ఆవేదన. తిరుపతి మాజీ ఎంఎల్ఎ సుగుణమ్మది, జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్రాయల్ది ఒకటే ఆవేదన. అందుకే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును ప్రకటించి రెండు వారాలు దాటినా వీరి పట్టు వీడలేదు. కిరణ్రాయల్ ‘పట్టు’గానే తొలినుంచి దూరంగానే ఉండి విముఖత చూపుతూ వచ్చారు. సుగుణమ్మ మాత్రం నారా లోకేష్ను, నారా చంద్రబాబును, పవన్కల్యాణ్ను వీలైనన్నిసార్లు కలిసి వేడుకుంటూనే ఉన్నారు. పొత్తులో భాగంగా టిడిపికి ఇవ్వలేకపోతే, జనసేనలో అయినా ఇప్పించాలని మొరపెట్టుకుంటూనే ఉన్నారు. తిరుపతి కోటలో టిడిపికి టిక్కెట్ లేకుండా పోటీ చేయడం తొలిసారైతే, తిరుపతి నాయకత్వాన్ని కాదనడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కిరణ్రాయల్, సుగుణమ్మలు అధినేతల ముందు సర్దుకుపోతామని చెప్పినా, వాళ్లు వెళ్లిన మరుక్షణం నుంచి మొహం చాటేస్తూనే ఉన్నారు. తిరుపతి అసమ్మతిని చక్కదిద్దేందుకు ఆకస్మికంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ శుక్రవారం సాయంత్రం అన్న నాగబాబుతో కలిసి విచ్చేశారు. అర్ధరాత్రి వరకూ ఓ ప్రైవేట్ హోటల్లో టిడిపి, జనసేన, బిజెపి నేతలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. మాజీ ఎంఎల్ఎ సుగుణమ్మతో అయితే గంటపాటు రహస్య మంతనాలు నిర్వహించారు. ‘మీడియా’తో మూడు జెండాల అజెండా ఒక్కటేనని, తిరుపతిలో వైసిపి జెండా లేకుండా చేస్తామని, జనసేన జెండా ఎగురవేస్తామని టిడిపి తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహయాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు భానుప్రకాష్రెడ్డి, జనసేనలో అలిగిన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్రాయల్ మూకుమ్మడిగా ప్రకటించారు. అయితే శనివారం సిఎస్ థియేటర్ నుంచి లీలామహల్ వరకూ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. బిజెపి – టిడిపి – జనసేన నుంచి చోటామోటా నాయకులు తప్ప పవన్కల్యాణ్ ముందు హామీ ఇచ్చిన ఒక్కరు కూడా ప్రచారంలో కనిపించకపోవడం గమనార్హం. అధినేతలు పవన్కల్యాణ్, చంద్రబాబు ముందు తల ఊపడమే తప్ప, వాస్తవానికి ఆరణి అభ్యర్ధిత్వాన్ని వారు అంగీకరించే పరిస్థితుల్లో లేరని ప్రస్ఫుటమవుతోంది. అయితే పవన్కల్యాణ్తో ఫొటో దిగిన నేతలు అందరూ వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో ‘సయోధ్య కుదిరింది’ అన్నట్లుగా బిల్డప్లు ఇవ్వడం శోచనీయం. ఏదిఏమైనా ఆరణి అభ్యర్ధిత్వం, తిరుపతి నేతల అసమ్మతి నేపథ్యంలో ఎక్కడ సీటు కోల్పోతామోననే భయం అధినేతల్లో లేకపోలేదు. వైసిపి అభ్యర్థి భూమన్ అభినరురెడ్డి గెలవకుండా చూడాలని, కూటమి ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత మూడు పార్టీలపై ఉందని హితబోధ చేసి వెళ్లారు. ఆరణి శ్రీనివాసులును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆదేశించారు. శుక్రవారం నాటి పవన్ మద్దిస్తం హిట్టా, ఫట్టా వేచి చూడాల్సిందే మరి.