శృంగవరపుకోట: రహదారి సౌకర్యం లేని మూల బొడ్డవర పంచాయతీ చిట్టెంపాడు గ్రామంలో మరో గిరిజన చిన్నారి కన్నుమూశాడు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న జన్ని ప్రవీణ్ (6నెలలు)ను తల్లిదండ్రులు ఏడు కిలోమీటర్లు కొండ దించి, పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరోజు వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ఘోషాస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడని బాలుడు తండ్రి సన్యాసిరావు, తల్లి సన్యాసమ్మ తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో బొడ్డవర రైల్వే స్టేషన్ వరకు తీసుకొచ్చి, అక్కడి నుంచి కొండపైకి తీసుకువెళ్లారు, ఈనెల 5న ఇదే గ్రామానికి చెందిన మాదల గంగమ్మను, తన ఆరు నెలల చిన్నారిని విశాఖ తరలించగా, 5వ తేదీన బిడ్డ, 16న తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస మరణాలతో గ్రామంలో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. వైద్యాధికారులు స్పందించి వైద్యసేవలందించాలని కోరుతున్నారు.