కలెక్టరేట్ ఎదుట మానవహారం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 39 వ రోజుకి చేరుకుంది. సమ్మెలో భాగంగా స్థానిక కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్సె యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు మాట్లాడుతూ ప్రభుత్వ జూలై నెలలో పెంచుతామన్నా వేతనాలు ఎంత ఇస్తారో చెప్పి జీఓ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రులు అన్ని సమస్యలు పరిష్కారం చేశామని చెప్పడం సరైంది కాదన్నారు. సమస్యలు పరిష్కారం చేస్తే ఆదేశాలు ఎందుకు ఇవ్వరని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.