జిసిసి కార్మికులకు పూర్తి పని దినాలు

Feb 12,2024 14:48 #Vizianagaram
Full working days for GCC workers

కల్పించాలని  చైర్పర్సన్ శోభా స్వాతి రాణికి, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్ కి వినతి..
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం జిసిసి సోప్ యూనిట్ నందు కార్మికులకు 15 రోజులకు మించి పని కనిపించడం లేదని, ఈ ఎస్ ఐ అర్హత కూడా కోల్పోతామని, వచ్చే 4000/- జీతంతో కుటుంబం ఏ విధంగా పోషించుకోవాలని, అది కూడా నెలాఖరికి ఇస్తున్నారని జిసిసి సోపు యూనిట్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షులు ఏ.జగన్ మోహన్ రావు, అధ్యక్ష, కార్యదర్శులు సంతు, సుశీలలు చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతి రాణి , మేనేజింగ్ డైరెక్టర్ జి. సురేష్ కుమార్ ని కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా పని సక్రమంగా ఉండడం లేదని, అడకత్తెరలో పోక చెక్కలా మా పరిస్థితి ఉందని, పని ఇవ్వాలి, జీతం చెల్లించాలని అడిగితే మూసేస్తామని బెదిరిస్తున్నారని, ప్రస్తుత ధరల్లో అర,కొర జీతాలతో ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. చైర్పర్సన్ డాక్టర్ శోభ స్వాతి రాణి స్పందిస్తూ పని దినాల పెంపుకు, జీతాల సకాలంలో చెల్లించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని, వారం రోజుల్లో సోపు యూనిట్ ను సందర్శిస్తానని స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు, రెసిడెన్షియల్స్ కు జి సి సీ సోప్స్ పంపిణీకి ప్రయత్నం చేస్తున్నామని, ఆర్డర్ వస్తే పూర్తిస్థాయిలో పని కలిగించగలమని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో శేషు, భారతి, రమణమ్మ, సూర్యనారాయణ , లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️