పాలకొండ : ప్రవేటు ఆసుపత్రులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.విజయపార్వతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె పట్టణంలో శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ, శ్రీ కోట దుర్గ, విఎంఎస్ హాస్పిటల్స్, పిఎంఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్, లిఖిత స్కానింగ్ సెంటర్లను శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల ఆరోగ్య తనిఖీ వివరాల రికార్డులు, ల్యాబ్, రోగులు వేచియుండే హాల్, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పాటిస్తున్న తీరు, టాయిలెట్ల నిర్వహణ మొదలగునవి పరిశీలించారు. ఆసుపత్రుల్లో జరుగు కాన్పుల వివరాలు హెచ్ఎంఐఎస్ పోర్టల్ ఆన్లైన్ నమోదు చేయాలన్నారు. నోటిఫైడ్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికెన్ గున్యా తదితర కేసులకు చికిత్సతో పాటు ఎల్ ఫారం నింపి వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి తెలియపర్చాలన్నారు. ఆరోగ్య సూచనలు, నిబంధనలు తెలియజేసే చార్టులను ఆసుపత్రుల్లో ప్రదర్శించాలన్నారు. ఈ పరిశీలనలో డిప్యూటీ డెమో వై. యోగీశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/01-2.jpg)