ప్రజాశక్తి-విజయనగరం : అంగన్వాడి సమ్మె పోరాటాన్ని లబ్ధిదారుల మద్దతు ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్, రామ్మూర్తి నాయుడు రాజాం, కాకర్ల వీధి అంగన్వాడి కేంద్రం పరిధిలో ఉన్న లబ్ధిదారుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉమా కుమారి అధ్యక్షతన కాకర్ల వీధిలో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే సమ్మెను విచ్చన్నం చేసేందుకు అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తీర్పిస్తున్న పరిస్థితి ఉందని, లబ్ధిదారులుగా ఈ రకమైనటువంటి పద్ధతులను ఎదుర్కొని అడ్డుకోవాలని కోరారు. అనేక సంవత్సరాలుగా గర్భిణీలకు బాలింతలకు ప్రీస్కూల్ పిల్లలకు అనేక రకాల సేవలు చేస్తున్న అంగన్వాడీలు తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించమని అడిగితే ప్రభుత్వము నిర్బంధం ప్రయోగిస్తుందని, అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తుందని తెలిపారు. మరోపక్క అంగన్వాడీ కేంద్రాలకు ఆహార నాణ్యతను పెంచాలని ఇస్తున్నటువంటి సరుకులు పెంపుదల చేయాలని, ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంపుదల చేసి పటిష్టంగా నడపాలని ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన జరగడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను లబ్ధిదారులు గమనించాలని అంగన్వాడీలకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.