ప్రజాశక్తి-తగరపువలస : అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు చేస్తున్న సమ్మె, నిరవధిక నిరాహార దీక్షలు, రిలే దీక్షలకు, వారు జరుపుతున్న పోరాటానికి మద్దతుగా సిఐటియు భీమిలి జోన్ కమిటీ ఆధ్వర్యాన స్థానిక ప్రైవేట్ మార్కెట్ వద్ద శనివారం రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు శనివారం నాటికి 40 రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. గర్భిణిలకు, బాలింతలకు, పిల్లలకు పోషకాహారం అందిస్తూ, వారి ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్ కార్యదర్శి రవ్వ నరసింగరావు, ఐద్వా జోన్ కార్య దర్శి కె నాగరాణి, కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగ్యలక్ష్మి, డివైఎఫ్ఐ నాయకులు ఎస్ శ్రీనివాస వర్మ, జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు సురేష్, రాజేష్,
ఆటో, ముఠా సంఘాల ప్రతినిధులు నీలాతి రాము, రీసు నరసింగరావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకో కార్యక్రమానికి ముందు స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి కార్మిక వాడ, జంక్షన్ మీదుగా మార్కెట్ వరకు ర్యాలీ చేశారు.