11వ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె
ప్రజాశక్తి – తణుకు రూరల్
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రజల ప్రాణాలు కాపాడిన మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోవడం సిగ్గు చేటని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్, మండల అధ్యక్షులు ఎన్.ఆదినారాయణ బాబు విమర్శించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మెలో భాగంగా 11వ రోజు కార్మికులు పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారం చేయమంటే పోటీ కార్మికులను తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు. ఈ సందర్బంగా ప్రతాప్, నీలాపు ఆదినారాయణ బాబు మాట్లాడుతూ ఇచ్చిన మాట అమలు చేయమంటే కార్మికులపై ప్రభుత్వం దాడి చేయడం అన్యాయమన్నారు. పోటీ కార్మికుల వల్ల జరిగే పరిణామాలకు ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. కార్మికుల సమ్మెకు సిఐటియు, మెడికల్ రిప్స్ యూనియన్ రమేష్, రామకృష్ణ, విఎ.రాజు, అంగన్వాడీలు సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కొమర రాజేశ్వరి, కె.రాజమ్మ, ఎన్.సురేష్, టి.ప్రసాద్, ఎస్.శ్రీను, డి.ఆశీర్వాదం, ఎ.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.భీమవరం రూరల్ : మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె తీవ్రతరం అవుతోంది. సమస్యలు పరిష్కరించకపోగా కార్మికులను రెచ్చగొట్టే విధంగా పోటీ కార్మికులను తీసుకురావడాన్ని సిఐటియు, ఎఐటియుసి తీవ్రంగా ఖండించాయి. శుక్రవారం సమ్మె కొనసాగింది. ఈ మేరకు పట్టణంలోని ఏడు డివిజన్లలో కార్మికులు, నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సమ్మె ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు తెలిపారు. అనంతరం పనికి వచ్చిన పోటీ కార్మికులను వెళ్లిపోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పనిముట్లు వదిలివేసి పోటీ కార్మికులు వెళ్లిపోయారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు మాట్లాడుతూ అధికారులతో సమ్మె విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ఐక్యంగా కార్మికులు తిప్పికొడతారని తెలిపారు. మున్సిపాల్టీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జెఎసి నాయకులు జి.నాని నీలాపు రాజు, బంగారు వరలక్ష్మి, నీలాపు విశ్వనాథం, నిమ్మకాయల ధనలక్ష్మి, ధనాల చినపెద్దిరాజు, బంగారు ఏసేపు మాడుగుల లక్ష్మి పద్మ పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో మహత్మా గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజు కొనసాగింది. ఈ మేరకు కార్మికులు పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.సతీష్, టి.భాను, దయామణి, దుర్గ నాయకత్వం వహించారు.ఆర్డిఒ కార్యాలయం ఎదుటమున్సిపల్ కార్మికుల బైఠాయింపుతమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు ఎఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డిఒ కార్యాలయం వద్ద బైఠాయించారు. రెండు గంటలపాటు నిరసన చేపట్టారు. ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కంకట రత్నకుమార్ సమ్మెకు మద్దతు తెలిపారు. ఆర్డిఒ కె.చెన్నయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ముందుగా సమ్మె శిబిరం నుండి కార్మికులు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాలూకా ఆఫీస్ ఆవరణలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపారు. ఎఐటియుసి ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు మాట్లాడారు. పాలకొల్లు : మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మూడు రోజులుగా కొనసాగుతున్న దీక్షకు ఎంఎల్ఎ సంఘీభావం తెలిపి మాట్లాడారు. నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. దేశానికి సేవ చేసే డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు సమాజానికి ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ సేవ చేసే పారిశుధ్య కార్మికులు అంతే అవసరం అన్నారు. మరోపక్క ఎన్నికలకు ముందు జగన్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు.