ప్రజాశక్తి – గణపవరం
రైతులు సేంద్రియ సాగు వైపు ఆసక్తి చూపాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. సోమవారం అప్పన్నపేటలో జరిగిన వైఎస్ఆర్ పొలంబడిలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సభకు గ్రామ సర్పంచి నూకారపు సుధాకర్రావు అధ్యక్షత వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రైతులు సేంద్రియ వ్యవసాయం మారాలన్నారు. పురుగు మందులు తక్కువగా వాడాలన్నారు. నీరు, వాతావరణ కాలుష్యం, భూతాపాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉంగుటూరు ఎంఎల్ఎ పుప్పాల వాసు బాబు సేంద్రియ వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించిన రైతులను అభినందించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ కైగాల శ్రీనివాసు మాట్లాడుతూ పొలంబడిలో అధికారులు సూచనల మేరకు సాగు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్వవసాయాధికారి జె.వెంకటేశ్వరరావు, ఎడిఎ పి.మురళీకృష్ణ, ఎఒవై.ప్రసాద్ సంతోష్ పాల్గొన్నారు.