లాభసాటి వరి వంగడాలు సాగు చేయాలి

భీమవరం :రైతులు లాభసాటి వరి వంగడాల సాగు చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన వరి వంగడాలు సాగు గురించి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అడ్వయిజరీ బోర్డ్‌ ఛైర్మన్‌ సభ్యులు, ట్రేడర్స్‌, మిల్లర్స్‌తో జిల్లా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి, జిల్లాలోని ప్రాంతాలకు అనుగుణంగా పండించగలిగే వెరైటీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఒక రైతుకు పదెకరాల భూమి ఉంటే అందులో రెండెకరాలు ప్రీమియం వెరైటీస్‌ను పండించి లాభాలను అంచనా వేసుకొని చూడాలన్నారు. 100 ఎకరాల నుండి 150 ఎకరాలకూ వరకూ ఒక క్లస్టర్‌ గా నిర్ణయించుకుని నాణ్యమైన, ఎగుమతికి అనువైన రకాలు పండించేందుకు ముందుకు రావాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ కైగాల శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️