ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్
ప్రజాశక్తి – భీమవరం రూరల్
భీమవరంలో ము ఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వవిఫ్, ఎంఎల్ఎ గ్రంథి శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ మంగళవారం ముఖ్యమంత్రి భీమవరం పర్యటన నేపథ్యంలో బుధవారం సాయంత్రం స్థానిక బైపాస్ రోడ్డులోని గ్రంధి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కాలేజీ వెనుక లేఔట్లో సభావేదికను, లూథరన్ హైస్కూల్ హెలీప్యాడ్ను జిల్లా జాయింట్ కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డితో కలిసి గ్రంథి.శ్రీనివాస్ పరిశీలించారు. సభాస్థలికి సంబంధించిన మ్యాప్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. హెలీప్యాడ్ నుంచి సభాస్థలి వరకూ సుందరీకరణ చేయాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెసి ఎస్.రామ్సుందర్ రెడ్డి, ఆర్డిఒ కె.శ్రీనివాసులురాజు, అధికారులు పాల్గొన్నారు.