జిల్లా కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి – భీమవరం
సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా మంజూరు చేసి జిల్లాలో 2,439 మందికి రూ.3.78 కోట్ల లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. అర్హులెవరూ పథకాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం పథకాలను విడుదల చేసింది. దీనిలో భాగంగా జిల్లాకు చెందిన 2,439 మంది లబ్ధిదారులకు రూ.3.78 కోట్లు విలువైన పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం విడుదల చేశారు. జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరు పి.ప్రశాంతి, శాసనమండలి సభ్యులు కవురు శ్రీనివాస్, సంబంధిత అధికారులు, వివిధ పథకాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొని తిలకించారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల అధికారి కెసిహెచ్.అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వెంకటరమణ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డి.మహేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర రావు పాల్గొన్నారు.