ప్రజాశక్తి – తణుకు రూరల్
ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల 30, 31వ తేదీల్లో తణుకులో నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపింది. శుక్రవారం తణుకులోని స్థానిక అమరవీరుల భవనంలో జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహాసభల ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేతివృత్తుల సంఘాల కన్వీనర్ ఎం.భాస్కరయ్య మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి వృత్తిదారులకు, వృత్తికి రక్షణ లేకుండా పోయిందన్నారు. వారి వృత్తిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. నేడు గీత వృత్తి ప్రమాదంలో పడిందన్నారు. గీత కార్మికులు పస్తులతో కాలం గడిపేస్తున్నారన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ మహాసభల్లో కర్తవ్యాలు రూపొందించి గీత వృత్తి రక్షణ కోసం పోరాటాలు చేయాలని, ప్రభుత్వం దిగొచ్చే వరకూ కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఆహ్వాన కమిటీ గౌరవాధ్యక్షులుగా ఇళ్ల వెంకటేశ్వరరావు (ఎంఎల్సి), అధ్యక్షులుగా కామన మునిస్వామి, గౌరవ సభ్యులుగా వాసంశెట్టి రాజగోపాల్ గూడూరి సత్యనారాయణ, జుత్తిగ చంద్రప్రసాద్, కొండేటి శ్రీనివాసు, కట్ట నాగ పోతురాజు, మరి కొంతమందిని ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎర్ర దేవుడు, కేతా గోపాల్, పివి.ప్రతాప్, బళ్ల చిన వీరభద్రం, కాగిత పాండు, బొక్క చంటి, మామిడిశెట్టి భూషణం పాల్గొన్నారు.