ప్రజాశక్తి – గణపవరం
ప్రభుత్వం జిఒ 117ను రద్దు చేయాలని, హైస్కూల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియం సమానంగా కొనసాగించాలని యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి ప్రభుత్వం డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని హైస్కూళ్లు, పాఠశాలలో జరిగిన యుటిఎఫ్ సభ్యత్వం క్యాంపెన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గణపవరం మండల విద్యాశాఖను పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేయాలన్నారు. ఇప్పటివరకూ విలీనం చేయకపోవడం వల్ల ఉపాధ్యాయులు పలు అంశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మకు వందనం’ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే అమలు చేయాలన్నారు. స్కూల్ మెర్జింగ్ను రద్దు చేయాలని, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఒకే సిలబస్ అమలు చేయాలని కోరారు. మండలంలో యుటిఎఫ్ను బలోపేతం చేయడానికి సంఘం నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు జె.నాని, జి.భవానిప్రసాద్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్.విజయరామరాజు, ఎస్.రత్నరాజు, హెచ్ఎస్వివి.ఆంజనేయులు, అసోసియేట్ అధ్యక్షులు హెచ్డి ప్రసాద్, కోశాధికారి శర్మ, నాయకులు వెంకటేశ్వర్లు, నాగభూషణరావు, సూర్యనారాయణ, రామచంద్రరావు పాల్గొన్నారు.