ప్రపంచవ్యాప్తంగా నయా ఫాసిస్ట్ మితవాద శక్తులు విజృంభిస్తున్నాయి. అర్జెంటీనా, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీ వంటి దేశాలలో మతతత్వ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి సామ్రాజ్యవాద దేశాల్లో కూడా 2022-23లలో జరిగిన ఎన్నికలలో నయా ఫాసిస్టులు దాదాపు అధికారంలోకి వచ్చినంతగా పెరిగారు. అమెరికా, ఇంగ్లండ్లలో ఈ ధోరణులను అధికార ప్రతిపక్ష పార్టీలే ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత్లోనూ మితవాద శక్తులు మైనార్టీలపైన వారి ప్రార్థనా స్థలాలపైన దాడులు చేస్తూ ఎన్నికల ముందు ప్రజలను మతపరంగా చీల్చేందుకు ఎలా యత్నిస్తున్నాయో చూస్తున్నాం. మానవత్వం, సమానత్వం, సౌభ్రాతృత్వం, శాస్త్రీయ దృక్పథం వంటి అత్యంత కీలక అంశాల మీద అంతర్జాతీయ వేదికలు, సంస్థలు చేసిన తీర్మానాలన్నింటిని బహిరంగంగా పెట్టుబడిదారీ దేశాలు తుంగలో తొక్కుతున్నాయి. నిశితంగా పరిశీలిస్తే ప్రపంచ వ్యాప్తంగా, అందులో భాగంగా మన దేశంలో కూడా ఈ చీకటి శక్తులు బలపడటానికి అనేక సాధారణ కారణాలు మనకు కనిపిస్తాయి.
యుద్ధోన్మాదం, జాతి, మత, ఉన్మాదాల కలయిక
తాజాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ మరీ ముఖ్యంగా పాలస్తీనాపై ఇజ్రాయిల్ నెలల తరబడి జరుపుతున్న మారణకాండను, పర్యవసానంగా ప్రపంచంలో పెరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని, ఉద్రిక్తతలను పరిశీలిస్తే యుద్ధోన్మాదం, మత, జాతి ఉన్మాదాలు పెచ్చరిల్లుతున్నాయని స్పష్టం అవుతుంది. పాలస్తీనాకి మద్దతుగా మధ్య ప్రాచ్యంలోని అనేక ఇస్లాం రాజ్యాలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రతిగా సామ్రాజ్యవాద దేశాలు క్రైస్తవ మత భావజాలానికి మద్దతుగా అన్నట్లు ఇజ్రాయిల్ని బలపరుస్తున్నాయి. 2023 డిసెంబర్ 29వ తేదీన దక్షిణాఫ్రికా ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయిల్ నరమేధంపై కేసు వేసింది. దీనికి మద్దతుగా బంగ్లాదేశ్, జోర్డాన్ ఇంకా అనేక లాటిన్ అమెరికా దేశాలు కోర్టుకు పత్రాలు సమర్పించాయి. జర్మనీ, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు ఇజ్రాయిల్కి మద్దతు తెలియజేస్తూ కేసు దఖలు పరిచాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలో పెరుగుతున్న నయా ఫాసిస్టు ఒత్తిడికి తలొగ్గి న్యాయస్థానం మీదే తీవ్ర విమర్శలు ప్రారంభించింది. గతంలో మయన్మార్లో రోహింగ్యా ముస్లింల మీద జరుగుతున్న మారణకాండపై గాంబియా ప్రభుత్వం ఇదే కోర్టులో వేసిన కేసుని బలపరిచిన జర్మనీ ఇప్పుడు ఇజ్రాయిల్ మారణకాండని బలపరుస్తూ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు. తాజాగా ఇరాన్ బలపరుస్తున్న షియా మిలిటెంట్లు జోర్డాన్లో పొంచి ఉన్న అమెరికా సైనిక దళాలపై డ్రోన్ దాడులు ప్రారంభించాయి. అంతర్జాతీయ న్యాయస్థానం పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయిల్ దాడులు నిలవరించమని ఆదేశించినా, తాను రక్షణ దాడులు మాత్రమే చేస్తున్నానని ఇజ్రాయిల్ బుకాయిస్తున్నది. అందుకు సామ్రాజ్యవాద దేశాలు వంతపాడటం ఈ అంతర్జాతీయ న్యాయస్థానం అస్తిత్వాన్నే ప్రశ్నించే పరిస్థితి దాపురించింది. అంతర్జాతీయ న్యాయస్థానం కూడా సామ్రాజ్యవాదుల అదుపాజ్ఞలలోనే ఉంటుందన్న అపోహను ఈ పరిణామాలు బలపరుస్తున్నాయి. ఇంత తీవ్రమైన పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా ‘విశ్వగురువు’ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అమెరికా ప్రాపకం కోసం ఇజ్రాయిల్ని బలపర్చడం, దాని యుద్ధోన్మాద, మతోన్మాద, ఫాసిస్ట్ విధానాలకు నిదర్శనం.
ఆర్థిక సంక్షోభం అసలు రహస్యం
సంక్షోభాలు రావడం, పోవడం పెట్టుబడిదారీ వ్యవస్థకు కొత్త కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థను సంపూర్ణంగా ‘స్కాన్’ చేసిన కార్ల్మార్క్స్ పెట్టుబడి గ్రంథంలోనూ, ఇతర అనేక తన అమూల్య రచనల్లోనూ స్పష్టంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు మూడు లక్షణాలు ఉంటాయని ప్రకటించాడు. ఒకటి ఆర్థిక సంక్షోభాలు. రెండు యుద్ధాలు. మూడు అసమాన అభివృద్ధి. ప్రస్తుత ప్రపంచంలో ఈ మూడూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇందులో ప్రత్యేకించి ఆర్థిక సంక్షోభం గురించి చెప్పుకోవాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడిన తరువాత 1929-30లలో వచ్చిన ఆర్థిక సంక్షోభం అప్పటికి చాలా పెద్దది. భయానకమైనది. దాన్ని అధిగమించగలిగిన పెట్టుబడిదారీ వ్యవస్థ 2008లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడలేని ఒక తీవ్రమైన దుస్థితికి చేరుకున్నది. నాలుగైదేళ్లు మించకుండానే అనేక దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నుంచి బయటపడుతూ వచ్చింది. కానీ ఈ తడవ 16 సంవత్సరాలు గడుస్తున్నా అతీగతీ కనపడటం లేదు. పరిష్కారం కోసం ఎంత ప్రయత్నించినా జబ్బు వికటిస్తుందే తప్ప బయటపడుతుందన్న ఆశ కనబడటం లేదు. ఈ ఆర్థిక సంక్షోభం యొక్క పర్యవసానం రాజకీయ, సాంఘిక రంగాల మీద తీవ్రంగా పడుతున్నది. దశాబ్దాలుగా పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడుకుంటూ వస్తున్న ఉదారవాద ప్రజాస్వామ్యం కళ్ళు తేలేసింది. ప్రొఫెసర్ ఐజాజ్ అహ్మద్ చెప్పినట్లు ఈ ఉదారవాద ప్రజాస్వామ్యం కనుమరుగవుతూ దాని స్థానంలోకి పచ్చి మితవాద, నయా ఫాసిస్టు లేక ఫాసిస్టు తరహా శక్తులకి భారీ ఊతం ఇస్తున్నది. అంతేకాదు పథకం ప్రకారం ఆయా దేశాల్లో విప్లవ శక్తులను, సోషలిస్టు భావజాలాన్ని దరిచేరనీయకుండా చూడటం మరో ముఖ్యమైన పరిణామం. ఈ పరిస్థితి అన్ని దేశాల్లో లాగానే మనదేశంలో కూడా మనకి కనపడుతున్నది. మధ్యేవాద పార్టీలు, ఆయా దేశాల్లో ఉన్న లౌకిక రాజ్యాంగాలు, గణతంత్ర పరిపాలనా విధానాలు, వ్యవస్థలను తొలుచుకుంటూ మితవాద శక్తులు అధికార పీఠాలను చేజిక్కించుకుంటున్నాయి. మధ్యేవాద పార్టీలు లేక సెంటర్ లెఫ్ట్ పార్టీలు కోలుకోలేనంతగా బలహీన పడుతున్నాయి. పైగా ఈ బలహీనతను అధిగమించడానికి మితవాద ధోరణులనే ఆసరా చేసుకోవడానికి పూనుకోవడంతో మరింత బలహీన పడుతున్నాయి. నయా ఉదారవాదం బడా కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్న పార్టీలనే ప్రజలు ఆదరించడం జరుగుతున్నది.
సోషలిజం తప్ప మరో మార్గం లేదు
అమెరికా ఇతర సామ్రాజ్యవాద దేశాలను కలుపుకొని సృష్టించాలనుకుంటున్న ఓ నూతన ప్రపంచానికి కేంద్ర బిందువు చైనా వ్యతిరేకత, సోషలిజం వ్యతిరేకత. అందుకు పై అనేక ఉదాహరణలతో పాటు ఆర్థికంగా అత్యంత బలోపేతం అవుతున్న చైనాను దెబ్బతీయడానికి అనేక కూటములను కడుతున్నది. అంతర్జాతీయ వేదికల మీద చైనాను, క్యూబాను, ఉత్తర కొరియాను లక్ష్యంగా పెట్టుకొని దాడులు నిర్వహిస్తున్నది. అత్యధిక దేశాలు ఖండించినా, ఐక్యరాజ్యసమితి తిరస్కరించినా క్యూబాపై ఆంక్షలను ముమ్మరం చేస్తున్నది. తన మాట కాదంటే ఐక్యరాజ్యసమితినే నిర్వీర్యం చేస్తానని హెచ్చరిస్తున్నది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ చీకటి శక్తులకు వ్యతిరేకత కూడా క్రమంగా ఊపందుకుంటున్నది. అనేక లాటిన్ అమెరికా దేశాలలో మార్పు ఈ కాలంలో మనం గమనిస్తున్నాం. బ్రెజిల్లో లూలా గెలవడం, వెనిజులాలో ఎన్ని అవరోధాలు సృష్టించినా మదురో బల పడటం, దశాబ్దాల అనంతరం చిలీలో వామపక్ష ప్రభుత్వం ఏర్పడటం, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలలో విస్తృతంగా కార్మిక వర్గ, విద్యార్థి, ఉపాధ్యాయ పోరాటాలు వెల్లువెత్తడం మనం చూస్తున్నాం. అలాగే సామ్రాజ్యవాద ఒత్తిడులకు వ్యతిరేకంగా అనేక అంతర్జాతీయ కూటములు ముందుకు వస్తున్నాయి. వీటన్నింటిలోనూ మనకు కనబడుతున్నది ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సాంఘిక సమస్యలు వేటినీ ఇక పెట్టుబడిదారీ వ్యవస్థ పరిష్కరించలేదని. ప్రత్యామ్నాయం అనివార్యమని క్రమంగా ప్రజలు గుర్తించడం ఆరంభం అయింది. ఈ దశలో సోషలిజం తప్ప మరో మార్గం లేదన్న భావనలు తెరపైకి రావడం యాదృచ్ఛికం కాదు.
- వ్యాసకర్త : ఆర్. రఘు, సిపిఐ(ఎం) కృష్ణా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, సెల్ : 9490098422 /