ఇటు లౌకిక వేదికలు… అటు బిజెపి పాచికలు

Feb 25,2024 07:17 #Editorial

ఇన్ని విధాలుగా రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక, మతతత్వ చర్యలకు పాల్పడుతున్న బిజెపికి, దానికి మద్దతిచ్చే పార్టీలకూ వ్యతిరేకంగా పోరాడాలని వామపక్షాలు చర్యలు ప్రారంభించాయి. తెలంగాణలోనూ ఒక లోక్‌సభ సీటులో పోటీ చేయాలనీ, మిగిలిన చోట్ల ‘ఇండియా’ వేదిక భాగస్వాములకు మద్దతివ్వాలని సిపిఎం రాష్ట్ర ప్లీనం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బిజెపిపై పోరాడాలని బి.వి.రాఘవులు సూచించారు. తమకు ఒక స్థానం కేటాయించాలని సిపిఐ నేత నారాయణ కోరారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాలలో బిజెపిని ఓడించే పోరాటం తీవ్రం చేయాలని ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపున మోడీ పాలనపై పోరాడవలసింది పోయి బిజెపికి వంత పాడటానికే సిద్ధమయ్యాయి ఎ.పిలో మూడు ప్రాంతీయ పార్టీలు. ముఖ్యమంత్రి జగన్‌, పార్లమెంటులో వారి సభ్యులు ఎప్పుడూ బిజెపికే మద్దతునిస్తూ వచ్చారు. తెలుగుదేశం కూడా ఇందుకు భిన్నం కాదు.

దేశ వ్యాపితంగా ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ప్రభావం పెరగడం కనిపిస్తున్నది. ఆ యా పాలక వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా మీడియా కావాలని ఇచ్చిన కథనాలు, హైప్‌లు వెనక్కుపోయి వాస్తవాలు, వారి వారి నిజరూపాలు వెల్లడవుతున్న దశ. ‘ఇండియా’ వేదిక చెల్లాచెదురైపోతుంటే మోడీ 400 స్థానాల వైపు దూసుకుపోతున్నట్టు ఏకపక్షంగా ప్రచారంలో పెట్టిన దృశ్యం ఇప్పుడిప్పుడే చెదిరిపోయి భిన్న శక్తుల సమీకరణాలు, సమిష్టి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఎ.పి లో సిద్ధం అంటున్న వైసిపి సభల ఆర్భాటం, బిజెపి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పరువు తగ్గించుకున్న టిడిపి, జనసేన ఒక జాబితా ప్రకటించినప్పటికీ ఈ అయోమయం మాత్రం మరింత పెరుగుతున్నదేగానీ తగ్గడం లేదని తేలిపోయింది. ఈ అవకాశవాద విన్యాసాలు, పదవీ కాంక్షల పల్టీలు, మేకపోతు గాంభీర్యాలు, గోడ దూకుళ్లు, రంగు మార్పిళ్ల మధ్య ప్రజల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య లౌకిక విలువల పరిరక్షణ ఎలాగన్నదే ఎప్పుడూ కీలక ప్రశ్న. ఆ దిశలో లభిస్తున్న పరిణామాలు, సమాచారాలు ఎలా వున్నాయన్నది ఒకసారి తేరిపార చూడవలసి వుంటుంది.

ఎ.పి లో చర్చలు, దేశంలోనూ మార్పులు

                 ఎపిసిసి అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ఆహ్వానంపై ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు విడివిడిగా సమావేశమై సమిష్టిగానూ చర్చించి కలసి పని చేయాలని నిర్ణయించు కున్నాయి. అదే విధంగా ఎన్నికలలోనూ బిజెపికీ దాని అనుకూల పార్టీలకూ వ్యతిరేకంగా పోరాడాలని ప్రాథమికంగా అంగీకరించాయి. త్వరలోనే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎ.పి కి వస్తుండటం ఈ క్రమంలో భాగమే. షర్మిల కాంగ్రెస్‌ ప్రవేశం నాటి నుంచి కేవలం అన్నాచెల్లెళ్ల తగాదాగా చూపించడమే టిడిపి అనుకూల మీడియాలో ప్రధానంగా జరిగింది. మరోవైపున వైసిపి అనుకూల మీడియా కూడా ఆమెను చంద్రబాబు పథకం మేరకు పని చేసే నేతగానే చిత్రించింది. అయితే కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఆమె టిడిపితో కలసి వెళ్లడం కుదిరే పని కాదని అందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ వేదికలో పాలుపంచుకుంటూ బిజెపిపై పోరాటంలో ముఖ్య పాత్ర వహించవలసిన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఆ పని చేయడం సాధ్యం కాదనీ తెలుసు. నాటకీయమైన సంచలనాల కోసం మొదట్లో మీడియా అలాంటి అంశాలపై కేంద్రీకరించినా నెల గడిచే సరికి కాంగ్రెస్‌ నేతలు వామపక్షాలతో కలసి మతతత్వ నిరంకుశ రాజకీయాలపై పోరాటంలో కలసి వచ్చారు. 20వ తేదీన విజయవాడలో జరిగిన సదస్సులో మాజీ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పాల్గొనడం, ఆ తర్వాత కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపి భవిష్యత్‌ ప్రణాళిక పంచుకోవడం సంభవించింది. ఈ విధంగా ఎ.పి లో రాజకీయ వాతావరణం ఏర్పడుతోంది. ఇదే సమయంలో దేశవ్యాపితంగానూ ‘ఇండియా’ భాగస్వాముల సీట్ల సర్దుబాట్లు ఒక కొలిక్కి వస్తుండడం గమనించదగ్గది. కావాలని ‘ఇండియా’ వేదిక పాత్రను తక్కువ చేసేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. బీహార్‌లో అవకాశవాద యూ టర్న్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ‘ఇండియా’ నుంచి వైదొలగడం పెద్ద పరిణామంగా ప్రచారమైంది. అదే సమయంలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను ఇ.డి అరెస్టు చేసి సంక్షోభం సృష్టించింది. ఆ ప్రభుత్వం కూలిపోతుందని బీహార్‌లోనూ ఎన్‌డిఎ పెరిగిపోతుందని అంచనా వేశారు. అయితే జరిగింది వేరు. బీహార్‌లో నితీశ్‌ ఒంటరిపాటై బిజెపి చక్రబంధంలో చిక్కుకుపోగా ఆర్జేడి నేత తేజస్వి యాదవ్‌ నిలదొక్కుకున్నారు. ‘ఇండియా’ వేదిక బలంగా కొనసాగింది. ఇక జార్ఖండ్‌లో కొత్త ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకున్నారు. ఇవి బిజెపి ఆశించిన దానికి భిన్నం. బీహార్‌ పరిణామాల తర్వాత ‘ఇండియా’కు ఊపు తగ్గిపోతుందనుకున్నారు. ‘ఇండియా టుడే’లో రాజ్‌దీప్‌ సర్దేశారు, ఎన్‌డిటివిలో రాహుల్‌ కునాల్‌ వంటివారు అదే చిత్రణ ఇచ్చారు. కానీ ఆప్‌, కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ వంటివి వాస్తవాలు గ్రహించి సర్దుబాటు దిశలో అడుగులు వేశాయి. ఇప్పుడు చూస్తే ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలలోనూ ఆప్‌ 4, కాంగ్రెస్‌ 3 పోటీ చేయాలని అవగాహనకు వచ్చారు. ఆప్‌ బలం పెంచుకున్న గుజరాత్‌లోనూ ఇరు పార్టీలు కలసి వ్యవహరించాలని అంగీకారానికి వచ్చాయి. ఇక యు.పి లో ఎస్‌.పి, కాంగ్రెస్‌ల మధ్య చెడిపోయినట్టేనని ఊదరగొట్టిన కథనాలు వెనక్కు పోయి 17 స్థానాలు కాంగ్రెస్‌కు కేటాయిస్తూ అవగాహన కుదిరింది. రాహుల్‌ గాంధీ న్యాయ యాత్రకు కూడా అఖిలేశ్‌ యాదవ్‌ హాజరైనారు. అదే సమయంలో మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్‌, ఎస్‌.పి కి ఒక సీటు కేటాయిస్తున్నది. ఇది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితికి పూర్తిభిన్నం. కాగా పోగా బెంగాల్‌లో మాత్రం మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌తోనూ కాంగ్రెస్‌కు అవగాహన పెరిగిందని చెబతున్నా మళ్లీ తామే మొత్తం 42 పోటీ చేస్తామని వారి నాయకుడు వివేక్‌ డేబ్రియన్‌ చెబుతున్నారు. సిపిఎం వరకూ తృణమూల్‌తో పొత్తు వద్దని పోరాటమే జరగాలని చెబుతున్నందున ఈ ప్రభావం పెద్ద లెక్కలోది కాదు. మరో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర లోనూ ఎన్ని చీలికలు తెచ్చినా ‘ఇండియా’ పార్టీలు సర్దుబాటు దిశలోనే వున్నాయి. హర్యానా, గోవాల లోనూ సర్దుబాట్లు జరగొచ్చు.

ఎదురు దెబ్బలతో కక్ష సాధింపు

                 అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు తోడు తానే పెద్ద బీసీనంటూ బీసీ వాదం తీసుకొచ్చారు. అంతకుముందు కాలంలో ‘మండల్‌ వర్సెస్‌ కమండల్‌’ అని బిజెపిని అపహాస్యం చేసేవారు. ఈ సారి అలా జరగకుండా తనే మండల్‌, కమండల్‌ కూడా తీసుకునేందుకు ప్రయత్నించింది. మార్కెట్‌ శక్తులను సంతోష పెట్టడం, ముస్లింలకు కూడా వేరే ప్రత్యామ్నాయం లేదన్న వాతావరణం కల్పించి తిప్పుకోవడం సంఘ పరివార్‌ ఎజెండాలో పెట్టుకుంది. అయితే వరుసగా జరిగిన పరిణామాలు ఆ ప్రయత్నాలను వమ్ము చేశాయి. పైగా ఎన్నికల బాండ్లను సుప్రీం కోర్టు కొట్టివేయడం నైతికంగా దెబ్బతీసింది. బరితెగించి ఆ తీర్పుకు బిజెపి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా ఎవరూ ఆమోదించకపోవడంతో వెనక్కు తగ్గింది. పులి మీద పుట్రలా చండీగఢ్‌లో మేయర్‌ ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇవన్నీ భరించలేని మోడీ కృష్ణుడికి కుచేలుడు అటుకులు ఇచ్చినా లంచం అంటారని చమత్కార వికారం చేశారు. దృష్టి మళ్లించడం కోసం కాంగ్రెస్‌ ఖాతాలు స్తంభింపచేయడం, ఏకపక్షంగా ఆదాయ పన్ను కింద రూ.67 కోట్లు విత్‌ డ్రా చేయడం అన్నీ కక్ష సాధింపులే. కానీ ఈ సమయంలోనే రైతాంగ ఆందోళనపై కాల్పులలో ఒకరు మరణించడం విమర్శలకు దారితీసింది. రాహుల్‌ గాంధీకి సంబంధించి ఏదో ఒక విషయాన్ని మీడియా పెద్దది చేసి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తుంటే స్వయంగా మోడీనే వాటిని అందిపుచ్చుకుంటున్నారు. అయోధ్య మందిరం దగ్గర ఐశ్వర్యా రారు, అమితాబ్‌ బచన్‌ వంటి పెద్దవారికి తప్ప పేదలకు ప్రాధాన్యత లేదని రాహుల్‌ అంటే దాన్ని మహిళల కోణంలోకి మళ్లించారు. కర్ణాటకలో ఆలయాలపై పన్ను వేశారనీ మరో దుమారం లేవదీశారు. కేరళ ప్రభుత్వంపైనా అనేక విధాలైన కథలు ప్రచారంలో పెట్టారు. ఈ ప్రచారాలకు తోడు ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి సివిల్‌ కోడ్‌, అసోంలో ముస్లిం వ్యతిరేక శాసనాలు మత వివాదాలను పెంచే ప్రయత్నాలుగా మొదలైనవే. రాబోయే రోజులలో ఈ పోకడలు పెరిగేవే.

ఎ.పి, తెలంగాణల్లో జరగాల్సింది…

                ఇన్ని విధాలుగా రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక, మతతత్వ చర్యలకు పాల్పడుతున్న బిజెపికి, దానికి మద్దతిచ్చే పార్టీలకూ వ్యతిరేకంగా పోరాడాలని వామపక్షాలు చర్యలు ప్రారంభించాయి. తెలంగాణలోనూ ఒక లోక్‌సభ సీటులో పోటీ చేయాలనీ, మిగిలిన చోట్ల ‘ఇండియా’ వేదిక భాగస్వాములకు మద్దతివ్వాలని సిపిఎం రాష్ట్ర ప్లీనం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బిజెపిపై పోరాడాలని బి.వి.రాఘవులు సూచించారు. తమకు ఒక స్థానం కేటాయించాలని సిపిఐ నేత నారాయణ కోరారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాలలో బిజెపిని ఓడించే పోరాటం తీవ్రం చేయాలని ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపున మోడీ పాలనపై పోరాడవలసింది పోయి బిజెపికి వంత పాడటానికే సిద్ధమయ్యాయి ఎ.పిలో మూడు ప్రాంతీయ పార్టీలు. ముఖ్యమంత్రి జగన్‌, పార్లమెంటులో వారి సభ్యులు ఎప్పుడూ బిజెపికే మద్దతునిస్తూ వచ్చారు. తెలుగుదేశం కూడా ఇందుకు భిన్నం కాదు. ఈసారి ఎన్నికలలో జగన్‌ను ఓడించేందుకోసం బిజెపితో కలసి పోటీ చేయాలని టిడిపి, జనసేన నిర్ణయానికి వచ్చాయి. జనసేన ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా వుంది కూడా. టిడిపి అధినేత చంద్రబాబు అమిత్‌షాతో చర్చలు జరిపి వచ్చారనీ, తమ మధ్య పొత్తు వుంటుందని ఈ పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. ఎ.పి కి సంబంధించినంత వరకూ ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు వంటి అనేక విషయాల్లో మోడీ సర్కారు అన్యాయం చేయడం వారికి సమస్యగా కనిపించదు. అయితే ఈ విషయంలో బిజెపి మాత్రం రకరకాలుగా మాట్లాడుతూ రాజకీయ చెలగాటమాడుతున్నది. తామెంత పాకులాడినా బిజెపి నుంచి స్పందన లేకపోవడంతో ఈ రోజు జనసేన, టిడిపి ప్రధాన ఎన్నికల జాబితా ప్రకటించాయి. 24 సీట్లలో జనసేన పోటీ అంటూ అయిదు సీట్లు ప్రకటించగా టిడిపి 94 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. అయితే బిజెపితో ఏదో చెలిమి కుదిరిపోయిందనే కథనాలపై ఉభయులూ ఇరురకాలుగా మాట్లాడటం విశేషం. బిజెపి పెద్దల ఆశీస్సులతో తాము అవగాహనకు వచ్చామని పవన్‌ అంటే, బిజెపి పొత్తుకు వస్తే కొన్ని సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు అన్నారు. ఉభయులూ కేంద్రం గురించి పల్లెత్తు మాటనకుండా జగన్‌ సర్కారు తప్పిదాలపైనే ధ్వజమెత్తారు. తమను ఇంత నిర్లక్ష్యం చేసిన బిజెపితో పొత్తు గురించి ఈ నేతలు ఎలా మాట్టాడుతున్నారో అర్థం కాదు. ఈ రోజు కూడా బిజెపి నేతలు పురంధేశ్వరి, జీవీఎల్‌ నరసింహారావులు పొత్తుల విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర, దేశ ఎన్నికల చరిత్రలో పొత్తుల పేరిట ఇంత దయనీయ పరిస్థితిని ఏ పార్టీ ఎదుర్కొని వుండదేమో గానీ టిడిపి జనసేన కోరి కోరి బిజెపి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మొత్తంపైన మూడు ప్రాంతీయ పార్టీలూ మోడీ భజన చేస్తున్న సమయంలో ఎ.పి ప్రజలు వారికి గుణపాఠం నేర్పవలసిన అవసరమేర్పడింది. తెలంగాణలోనూ బిఆర్‌ఎస్‌ బిజెపికి అనుకూలమనే ప్రచారం తిరస్కరణకు దారితీసింది. మరి ఈ సమయంలోనైనా వారు మత రాజకీయాలకు వ్యతిరేకంగా కచ్చితంగా ముందుకు రావడం లేదు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లు తమ మధ్య తగాదాలలో మునిగి తేలుతూ బిజెపిపై పోరాటం, ఆవశ్యకతను విస్మరిస్తున్నాయి. దాన్ని అవకాశంగా తీసుకుని బిజెపి ఎంఎల్‌సి కవితకు సిబిఐ నోటీసులు పంపడం, కాంగ్రెస్‌ నేతలపై దాడులు వంటివి చేయిస్తున్నది. విభజన సమస్యల పరిష్కారం చేయకుండా తగాదాలు పెంచుతున్నది. దేశ వ్యాపితంగా లౌకిక పార్టీలు ‘ఇండియా’ వేదికపై కలసి నిలుస్తున్న తీరు తెలుగు రాష్ట్రాలలోనూ శక్తివంతంగా అమలు చేయవలసి వుంది. తాజా పరిణామాలు ఆ విధమైన ఆశాభావం కలిగిస్తున్నాయి. హెచ్చరికా చేస్తున్నాయి.

తెలకపల్లి రవి
తెలకపల్లి రవి
➡️