దుర్మార్గపు చర్య

Dec 22,2023 07:20 #Editorial

                 స్వతంత్ర వార్తా పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌పై మోడీ ప్రభుత్వం వరుస దాడులు చేస్తున్న తీరు అత్యంత దుర్మార్గం. అక్టోబర్‌లో ఆ సంస్థ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ఆర్‌ విభాగం అధిపతి అమిత్‌ చక్రవర్తిని ఉపా చట్టం కింద అరెస్ట్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆ సంస్థ బ్యాంకు ఖాతాలను స్థంభింపచేసింది. ఏ మాత్రం ముందస్తు హెచ్చరికలు లేకుండా తీసుకున్న ఈ చర్యతో రోజువారీ వ్యవహారాలకు కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి ఆ సంస్థకు ఏర్పడింది. ఇక పాత్రికేయులు, వీడియోగ్రాఫర్లు, కార్యాలయ సిబ్బంది, కంట్రిబ్యూటర్ల జీతాల సంగతి చెప్పనవసరం లేదు. నిజానికి వారికి చెల్లింపులు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ అధికారులు ఫ్రీజ్‌ చేసిన విషయం వెల్లడైంది. తిరిగి ఖాతాలను ఎప్పటి నుండి పునరుద్ధరిస్తారన్న అంశాన్ని కూడా ఐటి అధికారులు చెప్పకపోవడంతో అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. క్రిస్మస్‌, నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి పండగల వేళ మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య జీతాల మీదనే ఆధారపడి, బతుకులీడ్చే కుటుంబాల్లో ఏ స్థాయిలో బాధను నింపుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినా ఈ షాక్‌ నుండి తొందరగానే బయటపడిన న్యూస్‌క్లిక్‌ సిబ్బంది, ఈ తరహా చర్యలు తమ మనోధైర్యాన్ని, అంకితభావాన్ని అణుమాత్రం కూడా తగ్గించలేవని, తమ శక్తినంతా ఉపయోగించి చివరివరకు పని చేస్తామని ప్రకటించడం స్ఫూర్తిదాయకం.

మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి న్యూస్‌క్లిక్‌పై దేశద్రోహ ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 2021 లోనే ఇడి, ఇన్‌కంట్యాక్స్‌ అధికారులతో పాటు ఢిల్లీ పోలీసులనూ రంగంలోకి దించింది. రకరకాల ప్రభుత్వ ఏజెన్సీలు రోజుల తరబడి విచారణ చేశాయి. అయినా, చైనా నిధులంటూ చేస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం వీసమంత కూడా నిరూపించలేకపోయింది. న్యూయార్క్‌ టైమ్స్‌ అదే ఆరోపణ చేస్తూ ప్రచురించిన బూటకపు కథనాన్ని అడ్డు పెట్టుకుని ఉపా చట్టం కింద అరెస్ట్‌లు చేసింది. అరెస్ట్‌లు చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేయలేదు. మరోవైపు తనకు వచ్చే నిధులన్నీ భారతీయ చట్టాలకు లోబడి, రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకు అకౌంట్ల ద్వారానే వస్తాయని న్యూస్‌క్లిక్‌ పదేపదే స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఆ ఖాతాలను స్థంభింపచేయడం ద్వారా గొంతు నులమడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు దాడులు, అరెస్ట్‌లు జరిగినా న్యూస్‌క్లిక్‌ కార్యక్రమాలు స్థిరంగా సాగుతున్నాయి. ఉద్యోగులు మొక్కవోని దీక్షతో సంస్థను ఎప్పటిమాదిరే ముందుకు తీసుకువెళ్ళారు. దీంతో కరడుగట్టిన ఆర్థిక నేరగాళ్ల విషయంలోనూ లేని విధంగా బ్యాంకు ఖాతాలను స్థంభింప చేసే దుర్మార్గానికి మోడీ సర్కారు తెగబడింది. ప్రభుత్వం అనుకున్న విధంగా జరిగితే న్యూస్‌క్లిక్‌కు ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనిని గుర్తించే ఆ సంస్థ ఉద్యోగులు తమకు అండగా నిలవాలని పౌర సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఆ దిశలో ముందడుగు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న అంశాన్ని ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు.

తనకు వ్యతిరేకంగా గళం విప్పేవారిలో భయోత్పాతాన్ని సృష్టించ డమే మోడీ ప్రభుత్వ లక్ష్యం. బీమా కొరెగావ్‌ కేసు దీనికో ఉదాహరణ. దేశ వ్యాప్తంగా ఉన్న మేధావులను, ప్రజాతంత్ర వాదులను ఉపా చట్టం కింద అరెస్ట్‌ చేసి, నాలుగేళ్లుగా నిర్బంధంలో ఉంచినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా మోడీ సర్కారు చూపలేకపోయింది. అటువంటి కుట్రే న్యూస్‌క్లిక్‌పై కూడా కేంద్రం చేస్తోంది. పార్లమెంటు భద్రతకు సంబంధించి నిలదీసినందుకు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 మంది ఎంపీలను పార్లమెంటు నుండి గెంటివేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ది ఎకానమిస్ట్‌’ పత్రిక భారత ప్రజాస్వామ్య స్తంభాలను ఒక్కొక్కటిగా కూలగొడుతున్నారు’ అని రాసింది. అది అక్షరాల నిజం! ఈ ధోరణిని ఇక ఏమాత్రం అనుమతించ కూడదు. ప్రత్యామ్నాయ మీడియా సంస్థలను అణచివేయడం ద్వారా ప్రజల గొంతు నొక్కడానికి, ప్రజాస్వామ్యాన్ని కూల్చడానికి జరుగుతున్న ప్రయత్నాలను గట్టిగా ప్రతిఘటించాలి…తిప్పికొట్టాలి. ప్రజాస్వామ్య ప్రియులు, దేశభక్తులందరూ ఈ పోరాటంలో కలిసి రావాలి.

➡️