కేంద్రం పూర్తి పెత్తనంలోకి ఎన్నికల కమిషన్‌

Dec 24,2023 07:20 #Editorial

ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాల అమలు కోసం ఈ చట్టం చేసినట్టు ప్రభుత్వం చెప్పుకుంది. కానీ వాస్తవానికి అక్షరాలా ఆ తీర్పు ప్రభావం లేకుండా చేయడానికీ అందులోని కీలక అంశాలను తిరస్కరిస్తూ చేసిన శాసనం ఇది. 140 మంది ఎంపీల సస్పెన్షన్‌, దాన్ని కప్పిపుచ్చడం కోసం ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ను అనుకరించారనే గగ్గోలు నేపథ్యంలో కీలకమైన ఈ శాసనం మరుగున పడిపోయింది. వాస్తవానికి అది భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు గొడ్డలి పెట్టు లాంటిది. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల ప్రక్రియకు ఆధ్వర్యం వహించే ఎన్నికల కమిషన్‌ నియామకం ప్రధాని ఇష్టారీతికి వదిలేసే దుర్మార్గమది. ఇదంతా సుప్రీంకోర్టు చెప్పినట్టు చెప్పడం మరింత విపరీతం.

                 దేశంలో ప్రజాస్వామిక విలువలను వమ్ము చేయడమే గాక రాజ్యాంగ వ్యవస్థల మూల స్ఫూర్తిని కూడా దెబ్బ తీస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో నిరంకుశ చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలో బాహాటంగా బరితెగించి వ్యవహరించినవి కొన్నయితే అచ్చంగా చట్టబద్దంగా చట్టం కోసమే చేస్తున్నట్టు కనిపిస్తూ చాప కింద నీరులా అనుకున్న పని కానిచ్చిన అతితెలివి వేషాలు అనేకం. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, కమిషనర్ల నియామక ప్రక్రియకు సంబంధించి పార్లమెంటులో ఇటీవల బిల్లు ఆమోదింపచేసుకోవడం ఈ రెండవ కోవలోకి వస్తుంది. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాల అమలు కోసం ఈ చట్టం చేసినట్టు ప్రభుత్వం చెప్పుకుంది. కానీ వాస్తవానికి అక్షరాలా ఆ తీర్పు ప్రభావం లేకుండా చేయడానికీ అందులోని కీలక అంశాలను తిరస్కరిస్తూ చేసిన శాసనం ఇది. 140 మంది ఎంపీల సస్పెన్షన్‌, దాన్ని కప్పిపుచ్చడం కోసం ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ను అనుకరించారనే గగ్గోలు నేపథ్యంలో కీలకమైన ఈ శాసనం మరుగున పడిపోయింది. వాస్తవానికి అది భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు గొడ్డలి పెట్టులాంటిది. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల ప్రక్రియకు ఆధ్వర్యం వహించే ఎన్నికల కమిషన్‌ నియామకం ప్రధాని ఇష్టారీతికి వదిలేసే దుర్మార్గమది. ఇదంతా సుప్రీంకోర్టు చెప్పినట్టు చెప్పడం మరింత విపరీతం. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామక షరతులు, సర్వీసు పదవీ నిబంధనలు) బిల్లు 2023 పేరిట వచ్చిన ఈ బిల్లును రాజ్యసభ డిసెంబర్‌ 12న ఆమోదించింది. ప్రధాన మంత్రి అధ్యక్షులుగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నియమించే మరో కేంద్రమంత్రి సభ్యులుగా కమిటీ ఈ ఎంపిక కోసం రాష్ట్రపతికి పేరు సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే కార్యదర్శులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారే ఈ పదవికి అర్హులుగా వుంటారు. అంటే నియమించే కమిటీలో ప్రధాని మాట అమలవుతుంది. నియామకానికి అర్హులైన వారు కూడా ఆ ప్రభుత్వంలో పనిచేసిన వారే అయివుండాలి. ఇక ఎన్నికల కమిషన్‌ స్వతంత్ర ప్రతిపత్తి గురించి చెప్పేదేముంది (ఒకసారి సిఇసిగా పని చేశాక మరో పదవి చేపట్టరాదని మాత్రం ఇందులోవుంది.)? ఈ బిల్లు సభ ముందుకు రావడానికి ముందు జరిగిన తతంగం మరింత కీలకమైంది.

రాజ్యాంగం, రాజకీయానుభవాలు

రాజ్యాంగం 324వ అధికరణం ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్రపతి నియమిస్తారని మాత్రమే పేర్కొంది. అయితే ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతియుతంగా జరిగితేనే ప్రజాస్వామ్యం అన్నపదానికి అర్థముంటుంది. దీర్ఘకాలం పాలన చేసిన కాంగ్రెస్‌ హయాంలోనే ఎన్నికల కమిషన్ల తీరు విమర్శలకు గురైంది. ఇందిరా గాంధీ హయాంలో ఎన్నికల, ఉప ఎన్నికల నిర్వహణ వాయిదా, కేంద్ర బలగాల వినియోగం వంటివి విమర్శల పాలైనాయి. 1972లో పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం, వామపక్షాలను అధికారంలోకి రాకుండా చేయడానికై సైన్యాన్ని దింపి రిగ్గింగ్‌ చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. చాలాసార్లు శాసనసభలను ముందే రద్దు చేయడం కూడా విమర్శల పాలైంది. ధనబలం, ఫిరాయింపులు వంటి అనైతికత తాండవించడం మొదలైంది. కాంగ్రెస్‌ నుంచి రాజీనామా చేసిన హెచ్‌ఎన్‌ బహుగుణ, వి.పి.సింగ్‌ వంటి వారు ఉప ఎన్నికలు కోరితే వాటిని వాయిదా వేస్తూ రద్దు చేస్తూ ఇష్టానుసారం వ్యవహరించడం కూడా దేశం చూసింది. అప్పట్లో ఒకే ఎన్నికల కమిషనర్‌ వుండేవారు. అద్వానీ రథయాత్ర తర్వాత వి.పి.సింగ్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత కీలుబొమ్మ చంద్రశేఖర్‌ సర్కారు వచ్చింది. ఆ సమయంలో ఎన్నికల కమిషనర్‌గా విఎన్‌ రమాదేవికి అర్హతలున్నా కాదని టిఎన్‌ శేషన్‌ను చేశారు. ఎన్నికల కమిషన్‌ అధికారాలను మొదటి సారి గట్టిగా ఉపయోగించిన శేషన్‌ను ఆదర్శంగా చెబుతుంటారు. కొన్ని విషయాల్లో అయన పాలక పార్టీలను అదుపు చేసిన మాట నిజమేగాని తనే ఒక నిరంకుశ కేంద్రంగా మారిపోయారు. మత రాజకీయాలను ఎన్నడూ పట్టించుకోలేదు. పార్టీల, ప్రభుత్వాల రాజ్యాంగ బద్దమైన హక్కులను కూడా భంగపరిచారు. ఆ సమయంలో తనను తొలగించే అవకాశం లేదు గనక మరో ఇద్దరు అదనపు కమిషనర్లను నియమించడం ద్వారా అదుపు చేయాల్సి వచ్చింది.

సిఇసిపై సుప్రీం కీలక తీర్పు

తర్వాతి కాలంలో వివిధ ప్రభుత్వాల హయాంలో ఈ తీరు మారిందని కాదు గానీ మోడీ హయాంలో మిగిలిన రంగాలలో వలెనే ఇక్కడా ఏకపక్ష ధోరణి ముదిరిపోయింది. సిబిఐ, ఇడి అధిపతులుగా ఆశ్రితులను నియమించి ప్రతిపక్షాలపై ప్రయోగించే ధోరణి పరాకాష్టకు చేరింది. దీనిపై అనేక సార్లు సంబంధిత వ్యక్తులు, సంస్థలూ కూడా సుప్రీం కోర్టులో సవాలు చేయడం చూశాం. ఎక్కువ సందర్భంలో నచ్చినవారిని అడ్డదోవలో అందలమెక్కించడం మాత్రం ఆగలేదు. పలుసార్లు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని అక్షింతలు వేసినా ఆగ్రహించినా ధోరణి మారింది లేదు. నచ్చిన వాళ్లను నియమించడం, వారికి పదేపదే పదవీ కాలం పొడిగించడం పరిపాటి అయ్యింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విషయంలో ముందే వద్దన్నా వినకుండా నియమించడమే గాక రెండుసార్లు పొడగింపు తీసుకున్నారు. చివరకు ఇదే ఆఖరి సారని హెచ్చరించింది కోర్టు. ఇక మరింత కీలకమైన ఎన్నికల సంఘం విషయంలోనూ ఇదే సమస్య ఎదురైంది. ఏకపక్ష నియామకాలు జరగకుండా ఒక నియామక ప్రక్రియ నిర్దేశించాలని కోరుతూ ఎడిఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌) తరపున 2022లో ఒక పిటిషన్‌ దాఖలైంది. దీన్ని త్రిసభ్య రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుండగానే సిఇసి పదవీ విరమణ వచ్చింది. ఆ సమయంలోనే అరుణ్‌ గోయెల్‌ అనే కార్యదర్శి తన పదవినుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం, 24 గంటల్లోనే సిఇసిగా నియమించడం జరిగిపోయాయి. సుప్రీం కోర్టు ఒకవైపున ఈ విషయం విచారిస్తుండగానే ఇంత హడావుడి దేనికని తీవ్ర విమర్శలు వచ్చాయి. సిఇసి పదవీ కాలం ఆరేళ్లు. లేదా 65 ఏళ్లు నిండడం. ఇందులో ఏ కొలబద్దతో చూసినా గోయెల్‌ ఎంపికయ్యే అవకాశముండదు. తమ ముందుకు వచ్చిన నాలుగు పేర్లలోనూ గోయెల్‌ చిన్నవారు గనక తనను నియమించినట్టు అటార్నీ జనరల్‌ (ఎజి) సమర్థించుకున్నారు. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలైనప్పుడు కేంద్రం అధికారాన్ని ప్రశ్నించలేమని కోర్టు చెప్పింది. అయితే ఎడిఆర్‌ కేసులో దీనిపై సమగ్ర తీర్పు వస్తుందని కూడా సూచించింది. తీరా ఆ కేసు విచారణకు వచ్చినపుడు ప్రభుత్వ నిర్ణయాన్ని ఎజి ఆర్‌.వెంకట్రామన్‌ ఏకపక్షంగా సమర్థించారు. రాజ్యాంగం సిఇసి నియామకంపై ఎలాంటి నిర్దేశకాలు చేయలేదని వాదించారు. ఏమీ చెప్పనప్పుడు మరింత జాగ్రత్తగా వుండాలని, దీనిపై ఏవైనా మార్గదర్శకాలు ఇస్తామని సుప్రీం కోర్టు చెప్పగా అలా జోక్యం చేసుకోవాలని న్యాయ వ్యవస్థకు అధికారం ఇవ్వలేదని కూడా ఆయన అభ్యంతరం చెప్పారు. రాజ్యాంగం ఈ విషయంలో మౌనం పాటించింది గనక కోర్టులు చేయడానికి లేదన్నారు. జస్టిస్‌ జోసఫ్‌ అధ్యక్షతన గల ధర్మాసనం దీనిపై తీర్పునిస్తూ సిఇసి నియామకంలో అనుసరించాల్సిన సూత్రాలపై పార్లమెంటు చట్టం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తి రాజ్యాంగం సిఇసి కి ఎంత ప్రత్యేక స్థానం ఇచ్చిందో అంబేద్కర్‌ మాటల్లోనే ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు సక్రమంగా జరగడమనీ, దానికి ఎన్నికల సంఘం కీలకమని అంబేద్కర్‌ అప్పట్లో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్తు చర్చలో ఈ నియామకంపై నిబంధనలు నిర్దిష్టంగా వుండాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ ప్రొఫెసర్‌ సిబ్బన్‌లాల్‌ సక్సేనా ప్రతిపాదించిన సమగ్ర సవరణ ఆ సందర్భంలో జరిగిన చర్చ వివరంగా పొందుపర్చారు. కాగ్‌ వంటి వాటితో పోలిస్తే ఎన్నికల సంఘం అత్యంత ముఖ్యం గనకే అందుకు ప్రత్యేక నియామక పద్ధతిని రాజ్యాంగం చెప్పిందనీ, ఇందుకు స్వతంత్రత అనేది కొలబద్ద అని స్పష్టం చేశారు. సిఇసి కార్యనిర్వాహక వర్గానికి లోబడి వుండకూడదనేది కీలకసూత్రం. పార్లమెంటు చట్టం చేసేలోగా కూడా స్వతంత్రత కాపాడేందుకు గాను ప్రధాని ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తులతో కూడిన కమిటీ రాష్ట్రపతికి సూచనను చేయాలని నిర్దేశించారు.

తీర్పుకు తూట్లు పొడిచిన కేంద్రం

కోర్టు చెప్పినట్టే తాము కొత్త చట్టం తెచ్చామని కేంద్రం వాదించడం తీర్పును అపహాస్యం చేయడమే. ఎందుకంటే ఏ తీర్పులోనైనా రెండు భాగాలుంటాయి. ఒకటి ఒబిటర్‌ డిక్టా, రెండు రేషియో డిసిడెండి. మొదటిది ఆదేశపూర్వకం. తప్పక అమలు చేయాలి. రెండోది ఆ తీర్పునకు మూలమైన స్ఫూర్తి వివరణ. ఈ తీర్పులో కేంద్రం చట్టం చేయాలన్నది ఆదేశమైతే సిఇసి స్వతంత్రత కాపాడాలనేద స్ఫూర్తి. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తిని భాగస్వామిగా చేయడం ద్వారా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. అయినా మోడీ సర్కారు ఏవో పొంతనలేని వాదనలతో బిల్లు తీసుకొచ్చింది. ప్రధాన న్యాయమూర్తిని భాగస్వామిగా వుంచాలని కోర్టు సూచనగా చెబితే దాని బదులు ప్రధాని నియమించే కేంద్ర మంత్రికి సభ్యత్వం కల్పించింది. ప్రతిపక్ష నాయకుడికి నామక: స్థానం కల్పించినా మెజారిటీ వారికే వుంటుందనేని స్పష్టం. అంతేగాక కార్యదర్శి హోదా కలిగిన వారేనని చెప్పడం కూడా ఎంపికను పరిమితం చేసింది. ఇక ఎంపికయ్యేవారికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేకాభిమానం చూపినట్టు వుండకూడదని కూడా కోర్టు చెప్పింది. కాని ఇక్కడ కావలిసిన వారినే తీసుకోవడం ద్వారా వారు లోబడి వుండాల్సిన పరిస్థితి కల్పించబడింది. ప్రధాన కమిషనరుగా నియమించబడేవారికి సుప్రీంకోర్టు జడ్జిలతో సమానంగా జీతభత్యాలు వుండాలని తీర్పులో చెబితే ప్రభుత్వం మొదట కార్యదర్శి స్థాయి వేతనం మాత్రమే ప్రతిపాదించింది. ప్రతిపక్షాల విమర్శల తర్వాతనే దాన్ని ఆ స్థాయికి చేరుస్తూ సవరణ తెచ్చారు. సిజెఐ కూడా సభ్యుడుగా వుండాలని వచ్చిన సవరణను సభ తోసిపుచ్చింది. కమిషన్‌ సభ్యులకు విధి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకుగాను కేసులు పెట్టే అవకాశం, తొలగింపు అధికారం లేకుండా చేయాలన్న సూచనను కూడా ఆమోదించలేదు. ఒక్క సిఇసికి మాత్రమే సుప్రీం కోర్టు జడ్జిల తరహాలో కేసుల నుంచి రక్షణ కల్పించబడింది. కోర్టుల జోక్యం కన్నా రాజకీయ జోక్యమే ఎన్నికల సంఘానికి సవాలు గనక ఆ ఒత్తిడి అలాగే వుంటుందన్న మాట. ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి ఎన్నికల సంఘ బిల్లు తెచ్చారని ఎంపీలు విమర్శించగా రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ఆగ్రహించారు. సభలో మనం స్వతంత్రంగా నిర్ణయాలు చేయాలిగాని ఎవరి పెత్తనం మనపై వుండరాదని సూక్తులు చెప్పారు. వాస్తవంగా జరిగింది వేరు. అన్ని విధాల కేంద్రానికి లోబడి వుండేలా ఎన్నికల కమిషనర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ఇక ఎన్నికల స్వతంత్ర నిర్వహణ మరింత ప్రశ్నార్థకమవుతుంది.

తెలకపల్లి రవి
తెలకపల్లి రవి
➡️