Union Minister: 1 నుంచి క్రిమినల్‌ చట్టాలు అమలు : కేంద్ర మంత్రి మేఘ్వాల్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నూతన క్రిమినల్‌ చట్టాలు వచ్చే నెల 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. అందరినీ సంప్రదించే ఈ చట్టాలు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించలేదంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది ఏకపక్ష నిర్ణయమేనని కాంగ్రెస్‌ పునరుద్ఘాటించింది. 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసి పార్లమెం టులో ఈ చట్టాలను ఏకపక్షంగా ఆమోదింప జేసుకున్నారని ఆరోపించింది. ఐపిసి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సిఆర్‌పిసి స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టాన్ని తీసుకొస్తున్నామని మేఘ్వాల్‌ చెప్పారు. ‘తమను సంప్రదించలేదని కొందరు చెబుతున్నారు. ఇది నిజం కాదు. వలసవాదుల కాలం నాటి చట్టాలను మార్చాలని చాలా కాలం నుండి డిమాండ్‌ ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఎప్పుడో మొదలైంది’ అని ఆయన తెలిపారు. ‘మేము ఎంపీలందరినీ సంప్రదించాం. అయితే ఉభయ సభలకు చెందిన 142 మంది సభ్యులు మాత్రమే స్పందించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల నుండి సూచనలు కూడా కోరాము. వారిలో కేవలం 270 మంది మాత్రమే స్పందించారు. మేము విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపాము. కానీ ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు తెలియజేయలేదు’ అని వివరించారు.
ప్రతిపక్షాలు లేకుండానే…
చట్టాలను మార్చేందుకు ఉద్దేశించిన బిల్లులకు లోక్‌సభ గత సంవత్సరం ఆమోదం తెలిపింది. అయితే పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో 97 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుండి సస్పెండ్‌ చేశారు. ప్రతిపక్షాలు లేకుండానే బిల్లులను ప్రభుత్వం సభలో ఆమోదింపజేసుకుంది. రాజ్యసభలోనూ ఇదే తంతు నడిచింది.

➡️