భీతిగొలిపే తీర్పు !

Dec 17,2023 07:17 #Editorial

రాష్ట్రపతి పాలన హయాంలో, రాష్ట్ర వ్యవహారాలపై శాసనాలు చేయాల్సింది పార్లమెంట్‌. అందువల్ల, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లుపై పార్లమెంట్‌ చర్చించి, ఆమోదించింది. ఇది, రాజ్యాంగంలోని 3వ అధికరణను బాహాటంగా ఉల్లంఘించడమే. రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి పార్లమెంట్‌ కట్టుబడి వుండాల్సిన అవసరం లేనప్పటికీ రాష్ట్ర శాసనసభను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంది. పైగా, 3వ అధికరణ కింద, ఒక రాష్ట్రం ఉనికిలో లేకపోయినా చట్టం చేయవచ్చు అనే అంశాన్ని కోర్టు పరిష్కరించలేదన్నది ఇక్కడ ఒక మౌలిక అంశంగా ఉన్నది. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం చెల్లుబాటు అవుతుందని కోర్టు సమర్ధించడం భవిష్యత్తులో ఇలాంటి ప్రక్రియలకు మార్గం సుగమం చేస్తుంది.

            రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు, జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రానికి ఉన్న రక్షణలు తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చీల్చడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, కార్యనిర్వాహక వ్యవస్థ అధికార దుర్వినియోగానికి రాజ్యాంగ న్యాయస్థానం ఎలా తలొగ్గిందో తెలియజేసే ఓ భయానకమైన తార్కాణంగా నిలిచిపోతుంది. ఈ ఘటన జరిగిన నాలుగేళ్ళకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒకే రోజున ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఇచ్చిన మూడు తీర్పులు దీర్ఘకాలికంగా తీవ్ర పర్యవసానాలు కలుగజేసేవిగా వున్నాయి. పైగా, రాష్ట్రాల హక్కులు, సమాఖ్యవాద మూలాలపై దాడి చేసేవిగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు 370వ అధికరణను రద్దు చేస్తూ జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల చెల్లుబాటును సమర్థించడం ద్వారా, జమ్మూ కాశ్మీర్‌ భారత యూనియన్‌లోకి విలీనమైనప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, వారికి తాజాగా తలపెట్టిన ద్రోహానికి సుప్రీం ఆమోదం తెలిపినట్లయింది. 370వ అధికరణను తాత్కాలిక మైనదని, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి అంతర్గత సార్వభౌమత్వం లేదని చెప్పడం ద్వారా అది ఈ పని చేసింది, అసలు జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇచ్చారనే ప్రశ్నను సర్వోన్నత న్యాయస్థానం దాటవేసింది. పైగా అటువంటి హోదా లేదా ప్రతిపత్తి తాత్కాలికం కాదని, కాశ్మీర్‌ ప్రజలకు రాజ్యాంగబద్ధమైన అధికారిక సంస్థలు ఇచ్చిన పవిత్రమైన హామీలో భాగమేనన్న అంశాన్ని కోర్టు విస్మరించడం విస్తుగొలుపుతోంది. జమ్మూ కాశ్మీర్‌ ప్రజా ప్రతినిధుల సమ్మతితోనే ఈ ప్రత్యేకహోదా అనేది జమ్మూ కాశ్మీర్‌ ప్రజా ప్రతినిధులతో చర్చించి అందరి సమ్మతితో రూపుదిద్దుకున్నదే ఈ ఆర్టికల్‌ 370. ఇది జమ్మూకాశ్మీర్‌ ప్రత్యేక స్వయం ప్రతిపత్తికి రాజ్యాంగపరమైన హామీని ఇస్తున్నది.

ఆర్టికల్‌ 370 అనేది జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించినదనే అంశాన్ని పట్టించుకోకుండా, కేంద్రానికి, జమ్మూ కాశ్మీర్‌కు మధ్య రాజ్యాంగ సమగ్రతను పెంపొందించేందుకు ఉద్దేశించబడిందంటూ త్రిసభ్య ధర్మాసనం తరపున ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించడం చాలా విడ్డూరంగా ఉంది. 370(1) కింద అధికారాన్ని రాష్ట్రపతి వినియోగించుకోవడమంటే రాజ్యాంగ సమగ్రత ప్రక్రియ సవ్యంగా సాగుతుండడంగా ధర్మాసనం పేర్కొనడం మరీ అతిశయంగా ఉంది. 370వ అధికరణ చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూస్తే ఆర్టికల్‌ 370ని నీరుగార్చేందుకు పదే పదే యత్నాలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వ నిరాకరించడం, రాష్ట్రాల అధికారాలను అంతకంతకూ హరించుకుంటూ పోతున్నది. రాష్ట్రపతి పాలన కింద కేంద్రం స్వయంగా నియమించిన గవర్నర్‌ ద్వారా వివిధ సందర్భాల్లో అది ఈ తంతును నిరాఘాటంగా సాగించింది.

ఈ తీర్పులోని మరీ దారుణమైన తర్కం ఏమిటంటే ‘370(3) అధికరణ కింద రాష్ట్రపతి జారీ చేసిన డిక్లరేషన్‌ సమగ్రత క్రమానికి పతాక సన్నివేశం’గా పేర్కొనడం. పైగా అది సరైన అధికార వినియోగం అని చెప్పడం. నిపుణులైన న్యాయమూర్తులు చేసిన ఈ వాదన 371వ అధికరణలో కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు కల్పించిన ప్రత్యేక హక్కులు లేదా అంశాలు కూడా జమ్మూ కాశ్మీర్‌కు వర్తించవని చెప్పడమే. జమ్మూ కాశ్మీర్‌కు ప్రజాసా ్వమ్యాన్ని, స్వయంప్రతిపత్తిని దశాబ్దాలుగా నిరాకరించడానికి ఇంతకన్నా మెరుగైన సమర్ధన మరొకటి లేదేమో! జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగ నిర్ణాయక అసెంబ్లీని శాసనసభగా పునర్‌ నిర్వచించడానికి 367వ అధికరణ సవరణను అధికారానికి లోబడనిదిగా కోర్టు పేర్కొన్నప్పటికీ, ఇది 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన నోటిఫికేషన్‌ చెల్లుబాటును ప్రభావితం చేయదని తీర్పు మరలా పేర్కొంది. ఈ తీర్పులోని మరో ప్రమాదకరమైన అంశమేమంటే, మోడీ ప్రభుత్వ నిరంకుశ, ఏకపక్ష చర్యలను సమర్ధించడమే. సమాఖ్యవాదం తాలూకు పరిమితమైన అంశాలను, రాజ్యాంగంలో పేర్కొన్న రాష్ట్రాల హక్కులను హరించివేసేందుకు మోడీ చర్యలు ఉద్దేశించబడ్డాయి. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడానికి దారి తీసిన, 2019లో పార్లమెంట్‌ ఆమోదించిన జమ్మూ కాశ్మీర్‌ పునర్వ్వవస్థీకరణ చట్టం చెల్లుబాటుపై అభిప్రాయం చెప్పడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. రాజ్యాంగంలోని 3వ అధికరణ చెల్లుబాటయ్యే రీతిలోనే ఉపయోగించారా లేదా, ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంత హోదాకు తగ్గించడానికి ఈ అధికరణను ఉపయోగించవచ్చా లేదా అన్నది ఇక్కడ విచారించాల్సిన అంశంగా వుంది. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరించబడుతుందనే సొలిసిటర్‌ జనరల్‌ హామీ ఇచ్చినందున, ఈ విషయాన్ని విచారించాలనుకోవడం లేదంటూ కోర్టు పేర్కొనడం న్యాయపరమైన బాధ్యతలను దారుణంగా ఉల్లంఘించడమే. కేంద్రం ఇచ్చిన ఈ హామీ కేవలం హామీగానే వుంది తప్ప దీనికి నిర్దిష్టమైన కాల పరిమితి అంటూ ఏమీ లేదు. అదే సమయంలో, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంత ఏర్పాటు సమర్ధనీయమే అంటూ కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. పైగా 2024 సెప్టెంబరు కల్లా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అంతేకానీ ఆ లోగా రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని నిర్దిష్టంగా పేర్కొనలేదు. రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం, ఒక రాష్ట్రం సరిహద్దును మార్చడానికి లేదా మరో రాష్ట్రంతో విలీనం చేయడానికి లేదా కొత్త రాష్ట్రం ఏర్పడేందుకు ప్రతిపాదన ఏదైనా రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభకు అభిప్రాయ సేకరణ నిమిత్తం పంపాల్సి వుంటుంది. రాష్ట్ర శాసనసభ నుండి సమాధానం అందిన తర్వాత మాత్రమే పార్లమెంట్‌ ఆ విషయంలో శాసనం చేయగలదు. జమ్మూ కాశ్మీర్‌ విషయంలో 356వ అధికరణను ఉపయోగించి 2018 నవంబరులో రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. అందువల్ల ఈ అంశంపై సంప్రదించాల్సిన రాష్ట్ర శాసనసభ లేదు.

రాష్ట్రపతి పాలన హయాంలో, రాష్ట్ర వ్యవహారాలపై శాసనాలు చేయాల్సింది పార్లమెంట. అందువల్ల, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లుపై పార్లమెంట్‌ చర్చించి, ఆమోదించింది. ఇది, రాజ్యాంగంలోని 3వ అధికరణను బాహాటంగా ఉల్లంఘించడమే. రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి పార్లమెంట్‌ కట్టుబడి వుండాల్సిన అవసరం లేనప్పటికీ రాష్ట్ర శాసనసభను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంది. పైగా, 3వ అధికరణ కింద, ఒక రాష్ట్రం ఉనికిలో లేకపోయినా చట్టం చేయవచ్చు అనే అంశాన్ని కోర్టు పరిష్కరించలేదన్నది ఇక్కడ ఒక మౌలిక అంశంగా ఉన్నది. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం చెల్లుబాటు అవుతుందని కోర్టు సమర్ధించడం భవిష్యత్తులో ఇలాంటి ప్రక్రియలకు మార్గం సుగమం చేస్తుంది. పార్లమెంట్‌లో అత్యధిక మెజారిటీ వున్న పాలక పార్టీ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం వల్ల తలెత్తిన పరిస్థితులను ఉపయోగించుకుని ఆ రాష్ట్రంలో ఒక భాగాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం ద్వారా ఆ రాష్ట్ర హోదాను కించపరిచేలా పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించవచ్చు.

కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న చర్యకు ఆమోద ముద్ర వేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సమాఖ్యవాద సూత్రాలకు, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్‌ బాధ్యతలు చేపట్టినపుడు, కార్యనిర్వాహక (ప్రభుత్వ) కోర్టుగా సుప్రీం కోర్టు మారదనే అభిప్రాయం వుండేది. కానీ, దురదృష్టవశాత్తూ, ఆ ఆశ ఇప్పుడు సన్నగిల్లుతోంది.

/ ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం/

➡️