సీనియర్ నటుడు మాగంటి మురళీమోహన్కు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా ఘన సత్కారం జరిగింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు చైతన్య జంగా, వీస్ విజయ వర్మ పాకలపాటి, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదరప్రసాద్, సెక్రటరీ ప్రసన్నకుమార్, వ్యాపార వేత్త కోగంటి సత్యం, మరో 20 మంది యువ కథానాయకుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. అట్లూరి పూర్ణచంద్రరావు చేతులమీదుగా 33వ ఏట కళామతల్లి ఆశీస్సులు పొందిన తాను నటునిగా, వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణించానన్నారు. ఈ క్రమంలో తనకు తోడుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీరశంకర్, తెలంగాణా మూవీ టెలివిజన్ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా శుభోదయం సుబ్బారావు ఎన్నికయ్యారు. ఆయా నూతన కార్యవర్గాలను మురళీమోహన్ ఘనంగా సత్కరించారు.