ఆ క్షణంలో భావోద్వేగానికి గురయ్యా : ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ

తెలంగాణ : పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి అయిన క్షణంలో తాను భావోద్వేగానికి గురైనట్లు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. పవన్‌ గురించి పరుచూరి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిలా ఎత్తుగడలు వేశారని కొనియాడారు. ” మీరు గమనిస్తే పవన్‌ కల్యాణ్‌ అప్పుడప్పుడు సడెన్‌గా చిన్న నవ్వు నవ్వుతుంటారు. ఆ నవ్వుకు నేను నిర్వచనం రాయాలనుకుంటున్నా. నేను పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమానిని. ఆయన సినిమాలు రాసే అదృష్టం మాకు రాలేదు. రాజకీయాల్లో ఆయన పోరాటం చేశారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని.. వేల ఓట్ల మెజారిటీతో గెలవడం సామాన్యమైన విషయం కాదు. తన పార్టీ తరఫున పోటీలో నిలిచిన వారందరినీ గెలిపించుకొని చరిత్ర సృష్టించారు. ఇన్ని రోజులు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడింది సినిమా డైలాగులు కాదని నిరూపించారు. మానసిక బలంతో ముందడుగు వేశారు. సినీరంగంలో పవన్‌ స్థాయి మనందరికీ తెలుసు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఎంతో హుందాగా, ఓపిగ్గా పనిచేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతే నాయకుల రాజకీయ జీవితం దెబ్బతింటుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఒకరు రాముడైతే, మరొకరు లక్ష్మణుడు.. ఒకరు కఅష్ణుడైతే, మరొకరు అర్జునుడిలా ఉండాలి. పవన్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో నేను కళ్లార్పకుండా చూశాను. చిన్నపిల్లాడు ఎంత ఎదిగిపోయాడో అనిపించింది. ఎదిగేకొద్దీ ఒదిగిఉండే తత్వం ఆయనది. వారాహి మాల వేసుకొని కనిపించినప్పుడు ముచ్చటేసింది. పవన్‌ రాజకీయాల్లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా ”. ” అప్పట్లో సీనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటించారు. పవన్‌ కూడా అలానే సినిమాలు చేయాలని నా కోరిక. ఆయన సినిమాలకు వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌లు, ఫైటింగ్‌లు అవసరం లేదు. చిన్న డైలాగ్‌లు చాలు. ‘అత్తారింటికి దారేది’లో గుండెలకు హత్తుకునే లైన్‌లు ఉన్నాయి. అందుకే అది ప్రేక్షకాదరణ పొందింది. అలాంటి అద్భుతమైన లైన్‌లతో ఆయన మళ్లీ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. రాష్ట్రానికి ఎంత మేలు చేస్తారో.. నిర్మాతలు, టెక్నీషియన్ల కష్టాలు విని.. సినీ రంగానికి కూడా అంతే మేలు చేయాలని ఆశిస్తున్నా ” అని పరుచూరి పేర్కొన్నారు.

➡️