కేన్స్‌లో ఉత్తమ నటిగా అనసూయ గుప్తా

May 25,2024 19:51 #Awards, #Film Industry
  • భారతీయ నటులకు ఇదే తొలిసారి

ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. ఉత్తమ నటిగా అవార్డు పొందింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును అందుకునున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్రకెక్కారు. ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ విభాగంలో ఉత్తమ నటి అవార్డును ఆమె సొంతం చేసుకుంది. బల్గేరియన్‌ చిత్ర నిర్మాత కాన్‌స్టాంటిన్‌ బోజనోవ్‌ దర్శకత్వం వహించిన ‘షేమ్‌లెస్‌’ చిత్రంలో ఆమె పాత్రకు గాను ఈ అవార్డు లభించింది. ఢిల్లీలోని ఓ వేశ్యాగృహం నుంచి పోలీసులను కత్తితో పొడిచి పారిపోయిన ‘రేణుక’ అనే ఒక వేశ్య జీవిత ప్రయాణాన్ని ఇందులో చిత్రీకరించారు. కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్‌గుప్తా వేశ్య పాత్రలో తన నటనతో మెప్పించారు. కేన్స్‌ వేడుకల్లో ‘షేమ్‌లెస్‌’ చిత్రాన్ని ప్రదర్శించగా ఉత్తమ నటిగా ఆమె అవార్డు దక్కింది. అనసూయ సినిమా రంగంలో ఉన్నప్పటికీ వెండితెరపై కనిపించలేదు. ముంబైలో ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం గోవాలో అనసూయ సేన్‌గుప్తా నివసిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ షో ‘మసబా మసబా’ చిత్రాన్ని నిర్మించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. బెంగాలీ దర్శకుడు అంజన్‌ దత్‌ నిర్మించిన రాక్‌ మ్యూజికల్‌ మ్యాడ్లీ బెంగాలీ (2009)లో ఆమె తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ఆమె నటనకు దూరమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అంజన్‌ దత్‌ సాయంతోనే షేమ్‌లెస్‌ చిత్రంలో కనిపించి ఉత్తమ నటిగా అవార్డ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో వేశ్యగా ‘రేణుక’ పాత్రలో అనసూయ సేన్‌గుప్తా మెప్పించింది. వేశ్యగా జీవిస్తున్న ఆమెకు సమాజంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొందో ఈ చిత్రం చూపుతుంది.

➡️