సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి’ : ది డైమండ్ బజార్. ఈ సిరీస్తోనే భన్సాలీ, డిజిటల్ ఫ్లాట్ ఫామ్లోకి అడుగు పెడుతున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో ఈ వెబ్ సిరీస్ మే 1 నుంచి అందుబాటులోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ఈ సిరీస్ నుంచి చిత్రబృందం ట్రైలర్ విడుదల చేసింది. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్లో ఉన్న హీరామండి ప్రాంతాన్ని ట్రైలర్లో చూపించారు. మల్లికాజాన్ (మనీషా కొయిరాలా) పరిపాలనలోని, వేశ్యలు నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని తమ గుప్పట్లోకి తెచ్చుకోవాలని బ్రిటీష్ వాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే మల్లికాజాన్ ఏం చేసింది? అన్నింటిని ఎదుర్కొని హీరామండిలో చివరకు ఎవరు రాజ్యమేలుతారు? అనే స్టోరీతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ చిత్రానికి భన్సాలీతో పాటు విభు పూరి, మితాక్షర కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/movie.jpg)