హాయ్ ఫ్రెండ్స్,
నా పేరు నీర్జన. నేను ఈ వేసవి సెలవుల్లో ఐఐటి మద్రాసుకు వెళ్లాను. అక్కటి వాతావరణం చాలా బాగుంది. చుట్టూ చెట్లతో కాలుష్యం లేని పర్యావరణంలో గడపడం నాకు బాగా నచ్చింది. అక్కడ జింకలను చూసాము. అవి మనుషులతో పాటు తిరగడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ ఐఐటి మద్రాస్ నిర్మాణం మొత్తం 850 ఎకరాల్లో జరిగింది. ఇది చూడడానికి గొప్పగా ఉంది. అక్కడ ఎర్రని రెండు తలలు గల వింత కీటకాలను కూడా చూసాము.
స్పిక్ మేకే అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మాకు ఈ కన్వెన్షన్ అవకాశం వచ్చింది. ఆరు రోజుల పాటు ఈ కన్వెన్షన్ నిర్వహించారు. విద్యార్థులు, కళాకారుల మధ్య మంచి వాతావరణం కల్పిస్తూ, భారతదేశ సాంప్రదాయాలను సజీవంగా ఉంచడంతో ఈ సంస్థ ఎంతో కృషి చేస్తోంది. కన్వెన్షన్లో భాగంగా ప్రతిరోజూ, మూడింటికి లేవడం, యోగా చేయడం, ఇంటెన్సివ్లో పాల్గొనడం మా దినచర్య. సమయం వధా చేయకుండా ప్రతిక్షణం ఆస్వాదించాం. ఈ ఆరు రోజులు సెల్ఫోన్ ఆలోచన రాలేదు.
అక్కడ మాకు లాగే ఇతర రాష్ట్రాల్లో పిల్లలు కూడా వచ్చారు. వాళ్లతో మాకు స్నేహాలు ఏర్పడ్డాయి. నేను అక్కడ ‘సింగి చామ్’ అనే ఇంటెన్సివ్లో పాల్గొన్నాను. ఇది సిక్కిం రాష్ట్రానికి చెందిన ఒక కళ. ఇది బుటియా కమ్యూనిటీకి చెందిన ప్రజలు చేస్తారు. ఇది (స్నో లయన్) మంచు సింహానికి, అక్కడున్న ప్రజలకు మధ్య సంబంధాన్ని కనపరుస్తుంది. ఈ ‘సింగి చామ్’ అనే నృత్యాన్ని ఏదైనా శుభకార్యాలు జరిగే ముందు ప్రదర్శిస్తారు. మా గురువుల దగ్గర నేను ఈ నృత్యాన్ని నేర్చుకున్నాను. మా ట్రిప్లో చివరి రోజు మహాబలిపురం వెళ్లాం. మా ప్రయాణాలలో మా ఉపాధ్యాయులు ఎంతో సహాయపడ్డారు. ఈ అమూల్యమైన అవకాశాన్ని కల్పించిన మా పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు.
– కె.నీర్జన, పదవ తరగతి,
అరవింద హైస్కూలు, కుంచనపల్లి.