నికోబార్‌ దీవులను తాకిన నైరుతి రుతు పవనాలు

  • 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో, న్యూఢిల్లీ : దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు ఆదివారం విస్తరించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండి), అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. ‘మాల్దీవుల్లో కొన్ని ప్రాంతాలు, కొమోరిన్‌ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు ఆదివారానికి నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి’ అని ఐఎండి తెలిపింది. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది క్రమంగా ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మే 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.
దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 31 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడిందని, ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
పసిఫిక్‌ మహా సముద్రంలో లా నినా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలోనే ఐఎండి అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలోని అనేక పట్ణణాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాలు కరువు వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనా దేశానికి భారీ ఉపశమనం కలిగిస్తుంది.

➡️