న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగడంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. తూర్పు ఢిల్లీ లోని కృష్ణా నగర్ ప్రాంతం లో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో ఈరోజు తెల్లవారుజామున 2 గంటల 30 నిముషాల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ కు ఫోన్కాల్ వెళ్లడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ సర్వీస్ లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ … ఈ ఘటనలో మొత్తం 12 మందిని రక్షించామన్నారు. కాకపోతే ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు ప్రకటించారు. వారిలో ఇద్దరిని అంజు శర్మ, కేశవ్ శర్మగా అధికారులు గుర్తించారు. ఓ వృద్ధురాలి మృతదేహం భవనం మొదటి అంతస్తులో అధికారులు కనుగొన్నారు. ఆమెను 66 ఏళ్లు కలిగిన పర్మిలా షాద్ గా అధికారులు గుర్తించారు. రిపోర్ట్ ప్రకారం… ఆ భవనంలోని పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఆ స్థలంలో ఉన్న 11 వాహనాలు అగ్నికి బూడిదయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/fire-accident-4.jpg)