న్యూఢిల్లీ : గత కొన్ని దశాబ్దాలుగా సాహిత్యరంగంతో పాటు సమాజంలోని విభిన్న కోణాలను స్పృశిస్తూ ‘ది హిందూ’ పత్రిక నిర్వహించే ‘ది హిందూ లిట్ ఫెస్ట్’ ఈ ఏడాది కూడా సిద్ధమైంది. జనవరి 26, 27 తేదీలలో నిర్వహించనున్న ఈ ఫెస్ట్కు చెన్నై వేదిక కానుంది. చర్చలు, భిన్నాభిప్రాయాల కలబోతకు ప్రముఖ రచయితలు, ప్రసంగకర్తలు, కాలమిస్టులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు సహా దేశ, విదేశాలకు చెందిన పలు రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు.
రాజకీయాలు, కరెంట్ అఫైర్స్ నుండి సాంస్కృతిక, కళారంగాల వరకు వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో హిందూ యాజమాన్యంతో పాటు జర్నలిస్టులు పాల్గొంటారు. ప్రముఖ రచయితల రచనలకు ఈ వేదికపై ఆవిష్కరించనున్నాయి. విభిన్న రంగాల్లోని ప్రముఖులను సత్కరించనున్నారు. 2011లో ప్రారంభమైన ఈ వేడుకలు వార్తాపత్రిక నైతిక విలువలకు అద్దం పడతాయని ‘ది హిందూ’ చైర్పర్సన్ నిర్మలా లక్ష్మణ్ పేర్కొన్నారు.