జనవరి 3, 4 తేదీల్లో ‘విజయనగర బాలోత్సవం’ ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగింది. ఇందులో విజయనగరం కార్పొరేషన్, మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 6 నుండి 10 తరగతులు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 13 అంశాల్లో పోటీలను నిర్వహించారు.మొదటిరోజు కథా రచన, పద్యాలు పాడడం, విచిత్ర వేషధారణ (ఫాన్సీ డ్రెస్ షో), పాటలు పాడడం లఘు నాటికలు, ఏకపాత్రాభినయం, మట్టితో బొమ్మలు చేయడం, జానపద నృత్యం (ఫోక్ డాన్స్) మొదలైన అంశాల్లో పోటీలు జరిగాయి. రెండవ రోజు వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖన, స్పెల్ బీ, క్విజ్, జానపద నృత్యం అంశాల్లో పోటీలు నిర్వహించడం జరిగింది. మొదటి రోజు 700 మంది పిల్లలు పాల్గొన్నారు. వారితో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా వచ్చారు. రెండవరోజు 800 మంది పిల్లలు పాల్గొన్నారు. మొదటిరోజు జాతీయ పతాకావిష్కరణతో ఉత్సవం ప్రారంభమైంది. బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసరి అప్పారావు పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో బాలోత్సవ వ్యవస్థాపకులు వాసిరెడ్డి రమేష్ బాబు, విశాఖ జిల్లా బానోత్సవ నిర్వాహకులు కోరెడ్ల రమాప్రభ, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారి, డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. భీష్మ ఆర్కెస్ట్రా వారు బాలోత్సవం థీమ్ పాటను పాడారు. గురజాడ అప్పారావు ”దేశభక్తి గేయం” కోలాటం, ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ నృత్య రూపకం ప్రదర్శించారు. రెండవ రోజు సాంస్కృతిక ప్రదర్శనలో ‘భువన విజయం’ను ప్రదర్శించారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం జరిగింది.
– కె శ్రీనివాసరావు కన్వీనర్, గురజాడ విజ్ఞాన కేంద్రం