- దేశంలో మీడియా అతిపెద్ద వ్యాపారం
- బిల్లుల ఆమోదానికే ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్
- బ్రిటిష్ పాలన నాటి అసమానతలు పునరావృతం
- ఐలు అఖిల భారత మహాసభలో పాలగుమ్మి సాయినాథ్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో మీడియా అతిపెద్ద వ్యాపారంగా మారిందని ప్రముఖ పాత్రికేయులు, రామన్ మెగాసేసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. ప్రధాన స్రవంతి మీడియా కార్పొరేట్ల చేతుల్లో ఉందని, అందువల్ల ఆ మీడియా 80 శాతం ప్రజల సమస్యలను రిపోర్టు చేయకుండా మినహాయిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కూడా మీడియా ప్రశ్నించటం లేదని తెలిపారు. కలకత్తాలోని హౌరాలో శనివారం జరిగిన ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 14వ అఖిల భారత మహాసభలో సాయినాథ్ ప్రసంగించారు. న్యాయవాదులు, జర్నలిస్టులు మధ్య దగ్గర సంబంధం ఉందని, చాలా మంది మిగతా 7లో జర్నలిస్టులు న్యాయవాదులేనని అన్నారు. భగత్ సింగ్, మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్ వంటి వారు గొప్ప జర్నలిస్టులని తెలిపారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను పోలివున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 146 మంది ఎంపిలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపిలు లేని సమయంలో ఎటువంటి చర్చ లేకుండా మూడు క్రిమినల్ చట్టాలను ఆమోదించారని పేర్కొన్నారు. మూడు రైతు చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ కమిటీలు డ్రాఫ్ట్ చేయలేదని, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపలేదని, వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యేక కమిటీ ముందు పెట్టలేదని పేర్కొన్నారు. ఆ బిల్లులను కార్పొరేట్లు తయారు చేశారని విమర్శించారు. ఓటింగ్కు డిమాండ్ చేస్తారని ఎనిమిదిమంది ఎంపిలను సస్పెండ్ చేసి, మూజువాణి ఓటుతో ఆమోదించారని విమర్శించారు. కీలకమైన బిల్లులను ఆమోదించుకునేందుకు మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్ చేస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న మీడియా, అధికార బిజెపిని ప్రశ్నించటం లేదని విమర్శించారు.
ప్రజాస్వామ్య పునాదులపై దాడి
ప్రజాస్వామ్య పునాదులపై దాడి జరుగుతుందని సాయినాధ్ విమర్శించారు. ప్రజాస్వామ్యం ముందుకు సాగాలంటే, అసమానతలు తగ్గడం, భయోత్పాత వాతావరణం క్షీణించడం, మానవ హక్కుల హననం జరగకుండా ఉండటం ముఖ్యమని అన్నారు. ప్రస్తుతం ఈ మూడు అంశాల్లో తిరోగమనం ఉందని, దీంతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. దేశంలో కరోనాతో 50 లక్షలకుపైగా భారతీయులు మరణించారని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయని, మన విశ్వగురు 4.86 లక్షల మంది చనిపోయినట్లు చెప్పారని విమర్శించారు. తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత ఆ లెక్కను కేంద్ర ప్రభుత్వం సవరించి, 5.21 లక్షల మరణాలుగా ప్రకటించిందని తెలిపారు. యుపిలో కరోనా మరణాలపై ప్రధాన మీడియా మౌనంగా ఉందని, ఎందుకంటే ఇడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రభుత్వం బెదిరిస్తుందని విమర్శించారు.
దాదాపు రెండు కోట్ల మంది వలస కార్మికులు రోడ్లపై వందల కిలో మీటర్ల నడిచి స్వస్థలాలకు వెళ్తే, ఒక్కరు కూడా జాతీయ రహదారిపై లేరని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపిందని చెప్పారు. 14 రోజుల తరువాత మరో అఫిడవిట్లో 23 వేల ఫుడ్ సెంటర్లు తెరిచినట్లు సుప్రీంకోర్టుకు తెలిపిందని అన్నారు. ఈ రెండు విరుద్ధ అంశాలపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించిందని పేర్కొన్నారు. ఇండియన్ రైల్వే శ్రామిక్ రైలు పేరుతో 25 రోజుల్లో 91 లక్షల మంది వలస కార్మికులను తరలించినట్లు చెప్పిందని పేర్కొన్నారు.
అసమానతల పెరుగుదల
దేశంలో బ్రిటీష్ పాలన నాటి అసమానతలు పునరావృతం అవుతున్నాయని సాయినాధ్ పేర్కొన్నారు. సంపద కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని, బిలియనీర్లలో మనదేశం మూడో స్థానంలో ఉందని అన్నారు. ఈ ర్యాంక్పై మోడీ సర్కార్ సంతోషంగా వేడుకలు చేసుకుంటుందని చెప్పారు. అదే మానవాభివృద్ధి సూచీ (హెచ్డిఐ) 132వ స్థానంలో ఉందని యుఎన్ఒ ఇచ్చిన నివేదికను మోడీ ప్రభుత్వం వ్యతిరేకించిందని, యుఎన్ఒపై దాడికి పూనుకుందని తెలిపారు. వారికి అనుకూలంగా రిపోర్టులు ఉంటే స్వాగతిస్తారని, వ్యతిరేకంగా ఉంటే దాడి చేస్తారని విమర్శించారు. ఆకలి సూచీలో 121వ స్థానం, ప్రెస్ ఫ్రీడం సూచీలో 161వ స్థానం, పర్యవరణ సూచీలో 180 స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. 1991 నుంచి 2001 వరకు భారతదేశంలో 98 మంది బిలియనీర్లు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 160కి పెరిగిందన్నారు. ఇటీవల చేరిన బిలియనీర్లు హెల్త్, ఐటి, ఉత్పత్తిదారుల రంగంలో ఉన్నారని తెలిపారు. జిడిపిలో ఐదో వంతు సంపద కేవలం 160 మంది వద్ద ఉందన్నారు. దేశంలో 30 శాతం మంది సంపద మైనస్లో ఉందని, 50 శాతం మంది సంపద కేవలం ఆరు శాతమేనని తెలిపారు.
సహజ వనరుల దోపిడీ
ప్రజలకు సంబంధించిన సహజ వనరులు కార్పొరేట్లకు దోచిపెట్టడంతోనే కార్పొరేట్ల సంపద పెరుగుతుందని అన్నారు. 2006 గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అదానీ సంపద మిలియన్ డాలర్లని, ప్రధాని మోడీ కావడానికి ముందు 2013 నాటికి ఆయన సంపద 3.8 బిలియన్ డాలర్లని, 2022 నాటికి 129 బిలియన్ డాలర్లకు పెరిగిందని తెలిపారు. ప్రపంచంలోని ఏ బిలినీయర్ సంపద ఇంతలా పెరగలేదని పేర్కొన్నారు. ఇటీవలి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన రెండు కీలకమైన ఒప్పందాలను చేసుకుందని అన్నారు. వీటివల్ల వ్యవసాయ రంగానికి, భద్రతకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సెంట్రల్ డేటాబేస్ను ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) మాన్శాంటో, అమెజాన్ వంటి కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారని, డేటాబేస్పై మొత్తం అమెజాన్, మాన్శాంటో నియంత్రణలోకి వెళ్తుందని పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధమని తెలిపారు.