- ఆయకట్టుకు నీరందక దిక్కుతోచని మిర్చి రైతు
- కౌలు భూముల్లోనూ బోర్లు వేసి పంటను కాపాడే యత్నం
ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిర్చి సాగు చేస్తున్న రైతుల కంట కన్నీటి మంటలొస్తున్నాయి. పంట ఏపుగా వచ్చి దిగుబడులొచ్చే సమయంలో ఆయకట్టుకు నీరు బంద్ అయింది. దీంతో, పంటను వదులుకోలేక కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతు న్నారు. కౌలు భూముల్లో సైతం లక్షలాది రూపాయలు వెచ్చించి సొంతంగా బోర్లు వేసుకున్న వారు కొందరైతే, ట్యాంకర్ల ద్వారా పంటను కాపాడుకునేందు కు తంటాలు పడుతున్న వారు మరికొందరు. ఏటా మాదిరిగానే జనవరి వరకు ఆయకట్టుకు నీరందు తుందని ఆశించి అనంతపురం జిల్లాలో 62 వేల ఎకరాల్లో మిర్చి వేశారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, మిడ్పెన్నార్ ఉత్తర కాలువ కింద బొమ్మనహల్, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, పెద్దవడు గూరు మండలాల్లో ఈ పంట ఎక్కువగా సాగవుతోంది. జూన్లో వేసిన పంట జనవరి ఆఖరుకు పూర్తవుతుంది. ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఈ తరుణంలో డిసెంబర్ ఒకటి నుంచి కాలువలకు నీటి సరఫరా ఆగిపోయింది. ఏడాదికి కౌలుకు తీసుకున్న భూముల్లోనూ మిర్చి పంటను కాపాడుకోవ డానికి కౌలు రైతులు ఇప్పుడు బోర్లు వేస్తున్నారు. పెద్ద వడుగూరు మండలంలో ఈ రకంగా మిడ్పెన్నార్ నార్తు కెనాల్ పరిధిలోని పెద్దవడు గూరు, చిన్నవడుగూరు, మిడుతూరు, దిమ్మగుడి గ్రామాల్లో గత 40 రోజుల్లో 200కుపైగా బోర్లు వేశారు.
అసలు సమస్య
అనంతపురం జిల్లాకు సాగునీటిని అందించే తుంగభద్ర డ్యామ్ నుంచి సాధారణంగా జులై నుంచి జనవరి ఆఖరు వరకైనా నీరొచ్చేది. ఈ ఏడాది తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో వర్షాభావంతో డ్యామ్కు 114 టిఎంసిల నీరు మాత్రమే వచ్చింది. అంతకు మునుపు ఏడాది 602 టిఎంసిల నీరు వచ్చినట్లు రికార్డులు మిగతా 2లోతెలియజేస్తున్నాయి. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు ఈ ఏడాది 26.828 టిఎంసిల నీరొస్తుందని అంచనాతో అధికారులు జూన్లో ప్రణాళికలు రూపొందించి లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది 16.41 టిఎంసిలు మాత్రమే ఇచ్చారు.
బోర్లు వేసినా నీరు పడక పంట వదిలేశా
నాకున్న ఎనిమిది ఎకరాల్లో నాలుగు ఎకరాల్లో పత్తి, నాలుగు ఎకరాలో మిర్చి పంట సాగు చేశాను. వర్షాభావమున్నప్పటికీ పత్తి కొంతవరకు దిగుబడి వచ్చింది. మిర్చి పంట పూర్తిగా దెబ్బతింది. కీలకమైన సమయంలో ఆయకట్టుకు నీరు రాలేదు. పంటను కాపాడుకునేందుకు రెండు బోర్లు వేసినా నీరు పడలేదు. ట్యాంకర్ల ద్వారా నీటి తడులు ఇచ్చి పంటను కాపాడుకుందామనుకుంటే డబ్బుల్లేక వదిలేశాను. ఇప్పటికే ఏడు లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. పంట ఏ మాత్రమూ చేతికొచ్చే అవకాశం లేదు. – రంగారెడ్డి, రైతు, పెద్దవడుగూరు
రైతులను ఆదుకోవాలి
ఆయకట్టుకు నీరొస్తుందన్న నమ్మకంతో రైతులు మిర్చిని సాగు చేశారు. కీలక దశలో సాగు నీరు ఆగిపోయింది. ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. పంట కళ్ల ముందే ఎండిపోతుండడంతో కాపాడుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు, కష్టాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నీటిని అందించడంతోపాటు, నష్టపోయిన రైతును ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా కల్పించాలి. – దస్తగిరి, ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు