ప్రజ్ఞానంద సంచలనం

Jan 17,2024 22:10 #Sports

ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌పై గెలుపుతో టాప్‌లోకి..

టాటా మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ

చెన్నై: టాటా మాస్టర్స్‌ టోర్నీలో చెస్‌ సంచలనం ఆర్‌. ప్రజ్ఞానంద పెను సంచలనాన్ని నమోదు చేశాడు. బుధవారం జరిగిన నాలుగో రౌండ్‌ పోటీలో ప్రజ్ఞానంద ప్రపంచ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌(చైనా)ను చిత్తుచేశాడు. దీంతో విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత.. క్లాసికల్‌ చెస్‌ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. అలాగే భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను అధిగమించాడు. ఫిడే ర్యాంక్సింగ్స్‌లో ఆనంద్‌ను దాటిన ప్రజ్ఞానంద.. భారత టాప్‌ ర్యాంకర్‌గా అవతరించాడు. ఫిడే తాజా ర్యాంకింగ్స్‌లో ప్రజ్ఞానంద ప్రస్తుతం 2748.3పాయింట్లతో 11వ స్థానంలో, విశ్వనాథన్‌ ఆనంద్‌ 2748 పాయింట్లతో 12స్థానంలో కొనసాగుతున్నాడు. త్వరలో ప్రకటించే ఫిడే ర్యాంకింగ్స్‌లో ప్రజ్ఞానంద భారత్‌ తరఫున టాప్‌ ప్లేయర్‌గా అగ్రస్థానంలో నిలవనున్నాడు. గెలుపు అనంతరం ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. బలమైన ప్రత్యర్థిని ఓడించడం అంత తేలికేమీ కాదని.. అందుకే తనకు ఈ విజయం మరింత ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. తొలిసారి వరల్డ్‌ చాంపియన్‌పై గెలుపొందడం రెట్టింపు సంతోషాన్నిస్తుందని హర్షం వ్యక్తం చేశాడు.అదానీ, సచిన్‌ ప్రశంసలుకాగా భారత టాప్‌ ర్యాంకర్‌గా నిలిచిన ప్రజ్ఞానందపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తదితరులు ఎక్స్‌ వేదికగా ప్రజ్ఞానందను అభినందించారు. ”నిన్ను చూసి దేశం గర్విస్తోంది” అంటూ కితాబులిచ్చారు.

➡️