- ఆఖరి ఓవర్లో అర్షదీప్ అద్భుత బౌలింగ్…
- సిరీస్ ను 4-1తో ముగిసిన టీమిండియా
బెంగళూరు : ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా విజయంతో ముగించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి టీ20లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో విజయంతో సిరీస్ ను టీమిండియా 4-1తో ముగించింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఆ జట్టులో బెన్ మెక్డార్మెట్ (54), ట్రావిస్ హెడ్(28), మాథ్యూ వేడ్(22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, బిష్ణోరు 2, అర్ష్దీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు కావాల్సి ఉండగా, అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేసి ఆసీస్ను కట్టడి చేశాడు. అర్షదీప్ విసిరిన ఇన్నింగ్స్ 20వ ఓవర్లో కేవలం 3 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్లో ఓ వికెట్ కూడా తీశాడు. తోలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. అయ్యర్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 21 పరుగులు నమోదు చేయగా… జితేశ్ శర్మ 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 24 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (10), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5), రింకూ సింగ్ (6) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్ 2, బెన్ డ్వార్షూయిస్ 2, ఆరోన్ హార్డీ 1, నాథన్ ఎల్లిస్ 1, తన్వీర్ సంఘా 1 వికెట్ తీశారు.