- ఏడు వికెట్ల తేడాతో
- కోల్కతా ఘన విజయం
న్యూఢిల్లీ: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్కు కోల్కతా నైట్రైడర్స్ కళ్లెం వేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీని కేవలం 153పరుగులకే పరిమితం చేసిన కోల్కతా.. ఆ లక్ష్యాన్ని 16.3ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీని కట్టడి చేయడంలో వరుణ్ చక్రవర్తి(3/16) కీలకపాత్ర పోషించగా.. వైభవ్ అరోరా(2/29), హర్షీత్ రాణా(2/28) తమవంతు సహకారం అందించారు. ఇక ఛేదనలో కోల్కతా ఓపెనర్ సాల్ట్(68; 33బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు) అర్ధసెంచరీతో మెరిసాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరుణ్ చక్రవర్తికి లభించింది. అంతకుముందు సొంత వేదికపై భారీస్కోర్ చేయడంలో ఢిల్లీ విఫలమైంది. తొలిగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టు కోల్కతా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 153పరుగులు చేసింది. తొలుత పేసర్లు టాపార్డర్ను కూల్చగా.. మిస్టరీ వరుణ్ చక్రవర్తి(3/16) ఇక తన వంతు అన్నట్టు మిడిలార్డర్ పని పట్టాడు. అయితే.. చివర్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (35నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. ఢిల్లీకి తొలినుంచే కష్టాలు మొదలయ్యాయి. వైభవ్ అరోరా, స్టార్క్ నిప్పులు చెరగడంతో ఓపెనర్ పథ్వీ షా(13), చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్(12), షారు హౌప్(7), యువకెరటం అభిషేక్ పొరెల్(18)లు డగౌట్కే చేరారు. ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలి బంతికే కెప్టెన్ రిషభ్ పంత్(27)ను బోల్తా కొట్టించాడు. వాళ్లంతా పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో, వంద లోపే సగం వికెట్లు కోల్పోయింది. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న ట్రిస్టన్ స్టబ్స్(4), అక్షర్ పటేల్(15)లు సైతం స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు. ఇంప్యాక్ట్ ప్లేయర్ కుమార్ కుశగ్ర(1)ను ఔట్ చేసిన చక్రవర్తి ఢిల్లీ భారీ స్కోర్ ఆశలకు గండి కొట్టాడు. అయితే.. రసిక్ దార్(8) అండగా కుల్దీప్(35) చివరి దాకా నిలబడి పంత్ సేనకు పోరాడగలిగే స్కోర్ అందించాడు. కోల్కతా బౌలర్లు వరణ్ చక్రవర్తికి మూడు, అరోరా, హర్షీత్ రాణాకు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోర్బోర్డు(సంక్షిప్తంగా)..
ఢిల్లీ : 153/9 (పంత్-28; చక్రవర్తి(3/16)
కోల్తా : 157/3(సాల్ట్ 68; అక్షర్ పటేల్ 2/25)