Apl: రెండో రోజు మొదటి మ్యాచ్‌లో.. వైజాగ్‌ వారియర్స్‌ విజయం

Jul 1,2024 23:26 #Cricket, #Sports

ప్రజాశక్తి- పిఎం పాలెం (విశాఖపట్నం) : వైజాగ్‌ వేదికగా ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ ఎపిఎల్‌ సీజన్‌-3 విశాఖ పిఎం పాలెం క్రికెట్‌ స్టేడియం వేదికగా సోమవారం రెండో రోజు మొదటి మ్యాచ్‌లో వైజాగ్‌ వారియర్స్‌, బెజవాడ టైగర్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో వైజాగ్‌ వారియర్స్‌ ఘన విజయం సాధించారు. తొలుత టాస్‌ గెలిచిన వైజాగ్‌ వారియర్స్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకొని బరిలోకి దిగింది. బ్యాటింగ్‌ బరిలోకి దిగిన బెజవాడ టైగర్స్‌ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 143 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎం అభినవ్‌, మహీప్‌కుమార్‌ తర్వాత వచ్చిన ధ్రువుకుమార్‌రెడ్డి, కెప్టెన్‌ రిక్కిబుయి అంతగా రాణించలేకపోయారు. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చిన మనీష్‌ గొలమారు 37 బంతుల్లో 44 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌ బరిలోకి దిగిన వైజాగ్‌ వారియర్స్‌ జట్లు 19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు బండారు సుజాన్‌, అశ్విన్‌ హెబ్బర్‌ పార్టనర్‌షిప్‌లో 62 పరుగులు చేసి అవుటయ్యారు. తర్వాత దిగిన కెప్టెన్‌ కె శ్రీకర్‌ భరత్‌ మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 23 బంతుల్లో 46 పరుగులు చేసి నాట్‌ అవుట్‌గా నిలిచాడు. మిడిల్‌ ఆర్డర్లో దిగిన మువ్వల యువన్‌ 20 పరుగులు చేసి చివరి వరకు బరిలో నిలిచి విజయం అందించారు.

➡️