ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 22 మందికి గాయాలయ్యాయని అన్నారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రావిన్స్లోని బజౌర్ జిల్లాలోని మాముంద్ తహసీల్లో చోటు చేసుకుంది.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో సోమవారం ఉదయం పోలియో వ్యాక్సిన్ వేసేవారికి భద్రత కల్పించేందుకు వెళ్లిన పోలీసులే లక్ష్యంగా ఈ బాంబు పేలుడు జరిగింది. పోలీసులు పోలియో టీకా బృందాలతో కలిసి వ్యానులో ఎక్కిన సమయంలో పేలుడు జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.దీంతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించినట్లు ప్రకటించారు.
ఈ పేలుడులో ప్రమాదంలో గాయపడిన వారందరూ పోలీసులేనని అధికార ప్రతినిధి వెల్లడించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా తాత్కాలిక ముఖ్యమంత్రి కేపీకే అర్షద్ హుస్సేన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఉగ్రవాదంపై యుద్ధం కొనసాగుతుందని అన్నారు. వ్యాక్సిన్పై వ్యతిరేకత కారణంగా పాకిస్థాన్లో ఉగ్రవాదులు తరుచూ పోలియో బృందాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. ఈ దాడికి బాధ్యులని ఇప్పటి వరకు ప్రకటించలేదు.. అయితే పాకిస్తాన్ తాలిబాన్తో సహా ఇస్లామిక్ తీవ్రవాదులు గతంలో అనేక మంది పోలియో టీకా కార్మికులతో పాటు వారిని రక్షించే పోలీసులపై బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే.