గాజా : సుమారు 40 మంది పాలస్తీనా జర్నలిస్టులు ఇజ్రాయిల్ చేతిలో బందీలుగా ఉన్నారు. ఆక్రమిత వెస్ట్జోన్ నుండి గతేడాది అక్టోబర్లో ఏకపక్షంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. 40 మందిలో 23 మంది రిపోర్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వారిపై ఎటువంటి విచారణ లేదా అభియోగాలు నమోదు కాలేదని, ఇప్పటికీ బందీలుగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఖైదీల వ్యవహారాల కమిటీ మరియు పాలస్తీనియన్ ఖైదీల సొసైటీ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్ 7 నాటికి 61 మంది జర్నలిస్టులను ఇజ్రాయిల్ బందించింది. అనంతరం వీరిలో 21 మంది విడుదలయ్యారు.
గతేడాది అక్టోబర్ 7 నుండి ఇజ్రాయిల్ పాలస్తీనాపై క్రూరమైన దాడులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల్లో 31,819 మంది పాలస్తీనియన్లు మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయిల్ దాడులను అంతర్జాతీయ సమాజం ఖండిస్తోంది. కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది.