హమాస్ తాజా ప్రతిపాదన
24 గంటల్లో 149 మంది పాలస్తీనియన్ల మృతి
రఫాపై దాడికి నెతన్యాహు యత్నం
గాజా : గాజాలో ఆరు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ హమాస్ కొత్తగా ప్రతిపాదించింది. ఈ సమయంలో పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేస్తే అందుకు ప్రతిగా తమ వద్ద బందీలుగా వున్న 42 మందిని విడుదల చేస్తామని పేర్కొంది. ”ఆరు వారాల పాటు కాల్పుల విరమణకు, ఖైదీల మార్పిడికి ఒప్పందం కుదుర్చుకోవాలి” అని హమాస్ వర్గాలు తెలిపాయి. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని గత కొద్ది వారాలుగా అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. ఇజ్రాయిల్ మొండివైఖరి వల్ల అవి ఫలించ లేదు. గాజాి నుండి అంటే అన్ని నగరాలు, పట్టణాల నుండి పూర్తిగా ఇజ్రాయిల్ బలగాలు వైదొలగేందుకు, శాశ్వత కాల్పుల విరమణకు దారి తీసేలా ఈ ఒప్పందం వుండాలని హమాస్ భావిస్తోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని హమాస్ అధికారి ఒకరు చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్వాసితులైన గాజా ప్రజలను తిరిగి స్వస్థలాకు వచ్చేందకు అనుమతించాలని కోరుతున్నారు. అలాగే ఒక బందీని విడుదల చేస్తే 20 నుండి 50మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని పేర్కొన్నారు. గతంలో 100-1 నిష్పత్తిగా ప్రతిపాదించిన దాన్ని ఇప్పుడు కుదించారు. కొత్త ప్రతిపాదన ప్రకారం, తొలుత మహిళలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని విడుదల చేయాలని సదరు అధికారి తెలిపారు. అలాగే మానవతా సాయాన్ని కూడా పెంచాలని కోరారు. గతేడాది అక్టోబరు 7న దాడి సందర్భంగా దాదాపు 250మంది ఇజ్రాయిలీ, విదేశీ బందీలను పట్టుకోగా, వారిలో చాలామందిని నవంబరులో వారం రోజులు పాటు అమలైన కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా విడుదల చేశారు. ఈజిప్ట్, కతార్, అమెరికాలు దీన్ని అమలు చేసే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
ఇదిలావుండగా, గత 24 గంటల్లో 149మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రంజాన్ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా నిన్న అల్ అక్సా మసీదులో వేలాదిమంది ప్రార్ధనలు జరిపారు. ఇజ్రాయిల్ బలగాలు భారీగా మోహరించిన వున్నా, ఆంక్షలు అమల్లో వున్నా ప్రజలు ప్రార్ధనలకు హాజరయ్యారు.
రఫాపై బాంబు దాడులకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు పన్నాగం పనానరు. ఆ పన్నాగాన్ని నెరవేర్చే పనిలో ఇజ్రాయిలీ దళాలు ఉన్నాయి.. నెతన్యాహు ఆమోదించిన ప్రణాళికను తాము చూడలేదని అమెరికా తెలిపింది.