మాలె : మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు మొయిజ్జు పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్సి) విజయం సాధించింది. మజ్లీస్లో 93 స్థానాలకు గాను పిఎన్సి 90 సీట్లలో పోటీ చేసింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 86 స్థానాలకు గాను 66 సీట్లలో గెలుపొందింది. పార్లమెంటు హౌస్లో మూడింట రెండు వంతులు కన్నా ఎక్కువ.
మొయిజ్జు ప్రత్యర్థి ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండిపి) ఘోర పరాజయం పాలైంది. 41 స్థానాల్లో పోటీ చేయగా.. 12 సీట్లు కూడా గెలుపొందలేకపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో గతేడాది అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొయిజ్జు తన విధానాలను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్లమెంటరీ మద్దతు లభించనుంది. ఆయన భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారంటూ ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.