హ్యూస్టన్ (అమెరికా) : అమెరికాలో తెలుగు యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో ఉన్న ఓ కన్వీనియన్స్ స్టోర్లో జరిగిన దోపిడీలో 32 ఏళ్ల తెలుగు యువకుడు హత్యకు గురైన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. 8 నెలల క్రితమే అమెరికాకు వచ్చిన దాసరి గోపీకఅష్ణ జూన్ 21న డల్లాస్ లోని ప్లజెంట్ గ్రోవ్ లోని కన్వీనియన్స్ స్టోర్ లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా యాజలి గ్రామానికి చెందినవారు. గోపీకృష్ణను హత్య చేసిన డావోంటా మథిస్ (21) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీ సమయంలో మథిస్ దుకాణంలోకి ప్రవేశించి కౌంటర్ వద్దకు వచ్చి గోపీకృష్ణను చాలాసార్లు కాల్చి చంపాడు. పారిపోయే ముందు వస్తువులను దొంగిలించాడని పోలీసులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మథిస్ ను మొదట అరెస్టు చేసి దోపిడీ అభియోగాలు మోపారు. కానీ గోపీకృష్ణ మరణం కారణంగా ఈ అభియోగాన్ని హత్య కేసుగా పోలీసులు అప్ గ్రేడ్ చేశారు. మెస్క్విట్ పోలీసుకు చెందిన సార్జెంట్ కర్టిస్ ఫిలిప్ మాథిస్ ప్రవర్తనను చాలా విచిత్రమైనదిగా అభివర్ణించారు. జూన్ 20న వాకో సిటీలో జరిగిన మరో కాల్పుల కేసులో కూడా మాథిస్ పై అభియోగాలు నమోదయ్యాయి. మహమ్మద్ హుస్సేన్ (60)పై అతడు చాలాసార్లు కాల్పులు జరిపాడు. కాగా, గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అక్కడి భారత కాన్సులేట్ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేస్తోంది. గోపీకృష్ణ పార్థివదేహాన్ని భారత్ లోని ఆయన స్వగ్రామానికి తరలించడానికి వీలుగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతినిధులు, కుటుంబ సభ్యులు కాన్సులేట్ తో కలిసి పనిచేస్తున్నారు. పోలీసు శవపరీక్షలు, అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని, మంగళవారం నాటికి మృతదేహాన్ని తరలించేందుకు ప్రాధాన్యమిస్తున్నామని కాన్సులేట్ స్పష్టం చేసింది. నైట్ షిఫ్టులో పనిచేసే కన్వీనియన్స్ స్టోర్ క్లర్క్ పై దాడి జరగడం ఇది రెండోసారి. ఈ ఘటన డల్లాస్, పరిసర ప్రాంతాల్లోని భారతీయ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. గోపికృష్ణకు భార్య, కుమారుడు ఉన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.