గాజా : ఇజ్రాయిల్ వైమానిక, భూతల దాడులను పెంచడంతో గతంలో ‘సురక్షిత నగరం’గా పరిగణించిన దక్షిణ నగరం రఫా నుండి కూడా పాలస్తీనియన్లు తరలివెళుతున్నారు. ఇజ్రాయిల్ దాడులను పెంచడంతో ప్రాణ భయంతో రఫా నుండి పారిపోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఖాన్యూనిస్లోని నాసర్ ఆస్పత్రిలో చిక్కుకుపోయిన వారు అక్కడి నుండి పారిపోతున్నారు. సోమవారం రాత్రి ఆస్పత్రిని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించిన కొద్దిసేపటికే ఇజ్రాయిల్ దళాలు స్నిపర్ దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
ఈ దాడుల్లో 67 మంది మరణించినట్లు పాలస్తీనియన్ వైద్య అధికారులు తెలిపారు. ఆ సమయంలో డజన్ల కొద్దీ ప్రజలు ఆసత్రిలో చిక్కుకుపోయారని అన్నారు. అనంతరం 14 నివాసాలు, మూడు మసీదులపై కూడా దాడులు చేశారని అన్నారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల్లో సుమారు 28,576 మంది పాలస్తీనియన్లు మరణించగా, సుమారు 68,291 మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.
ప్రాణభయంతో పరుగులు తీస్తున్న వారిపై ఇజ్రాయిల్ దళాలు దాడికి దిగడాన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడాలు తీవ్రంగా ఖండించాయి. ఇకనైనా ఇజ్రాయిల్ తన స్నేహితులు, అంతర్జాతీయ సమాజం సూచనలను పాటించాలని ఆయా దేశాల నేతలు పేర్కొన్నారు. హమాస్ను ఓడించిన మూల్యం చెల్లించేందుకు పౌరులు సిద్ధంగా లేరని అన్నారు.