రియోడిజెనెరియో (బ్రెజిల్) : బ్రెజిల్లో తుపాను బీభత్సానికి పలువురు మృతి చెందారు. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు బ్రెజిల్ అతలాకుతలమవుతోంది. రియోడిజెనెరియో రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో తుపాను తీవ్రతకు 10మంది చనిపోయారు. వర్షం ధాటికి పెట్రోపోలిస్ పట్టణంలోని ఓ ఇళ్లు కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఒక బాలికను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అదే ప్రాంతంలో బాలిక తండ్రి మృతదేహాన్ని కనుగొన్నారు. సాంటా క్రుజ్ ద సెర్రాలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. రియోడిజెనెరియో గవర్నర్ క్యాస్టట్రో మాట్లాడుతూ …. తుపాను తీవ్రతకు పెట్రోపోలిస్ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఎడతెరిపిలేని వానలకు క్విటాదిన్హా నది ఉప్పొంగి ప్రవహిస్తుందని తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే బ్రెజిల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రమాద ప్రాంతాల్లో అధికార సిబ్బంది సహాయకచర్యలు చేపడుతున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/brazil.jpg)