‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ వద్దు -సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో

Mar 15,2024 22:05 #cpm politburo, #prakatana

న్యూఢిల్లీ : ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అన్న భావనకు తాము పూర్తిగా వ్యతిరేకమని సిపిఐ(ఎం) పునరుద్ఘాటించింది. అప్రజాస్వామికమైన ఈ ప్రతిపాదనను ఐక్యంగా వ్యతిరేకించాల్సిందిగా అన్ని ప్రజాస్వామ్య సంస్థలకు, పౌరులకు విజ్ఞప్తి చేసింది.

లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సు, దీనిని సాధించేందుకు అది ప్రతిపాదించిన చర్యలు తిరోగమనంతో కూడినవని వ్యాఖ్యానించింది. ఇవి దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ స్థాపనకు దారి తీస్తాయని పేర్కొంది. పార్టీ పొలిట్‌బ్యూరో శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది.

రాజ్యాంగానికి, ఇతర చట్టాలకు 18 సవరణలు చేయాలని ఈ నివేదికలో ప్రతిపాదించారు. ఇవి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కుళ్లబడిచేవిగా, అలాగే ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల హక్కును హరించేవిగా ఉన్నాయి. అంతేకాదు, కేంద్రా రాష్ట్ర సంబంధాల్లో కేంద్రానికి మరిన్ని అధికారాలిచ్చేవిగా కూడా ఉన్నాయి. ఉదాహరణకు, 18వ లోక్‌సభ ఎన్నికల తరువాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని తగ్గించాలని ఈ నివేదికలో ప్రతిపాదించారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా 19వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒకేసారి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రతిపాదించారు. అంటే దీనర్ధం 2026లో ఎన్నికలు జరగాల్సిన పశ్చిమ బెంగాల్‌, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలం ఈ చర్య వల్ల సగానికన్నా పైగా కుదించబడుతుంది.

లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించిన వంద రోజుల్లోగా అన్ని పంచాయితీలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కూడా కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించి, నిర్వహిస్తూ వుంటాయి. మూడు స్థాయిల్లో ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితాలు, అన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అధికారాలు కేంద్రీకృతమవుతాయని, అది పంచాయితీలు, స్థానిక సంస్థల ప్రాధమిక సూత్రమైన వికేంద్రీకరణ వ్యవస్థకే పూర్తి విరుద్ధమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అందుకే ఒక దేశం, ఒక ఎన్నిక అన్న భావనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పొలిట్‌బ్యూరో మరోసారి స్పష్టం చేసింది. ఈ అప్రజాస్వామిక చర్యను సమైక్యంగా వ్యతిరేకించాలని అన్ని ప్రజాతంత్ర శక్తులకు పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది.

ఎన్నికల బాండ్ల నిధుల ధోరణి బహిర్గతమైంది

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తదుపరి ఆదేశాన్ని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్వాగతించింది. బాండ్లు ఇచ్చిన దాతలు, పుచ్చుకున్నవారి పేర్లు తెలిసేలా ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ కోడ్‌లను ఎస్‌బిఐ అందజేయాలంటూ సుప్రీం కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలను ప్రజలకు మరింత పారదర్శకంగా తెలియజేయడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దెబ్బతీసేందుకే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయన్న వాస్తవం దీంతో మరింత స్పష్టమైందని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది.

తమ వద్ద అందుబాటులో వున్న డేటాను ఎన్నికల కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో గురువారం అప్‌లోడ్‌ చేసినప్పటి నుంచి, ఈ డేటాను విశ్లేషించే యత్నాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల బాండ్ల పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టచ్చని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అయితే, ఎన్నికల బాండ్ల ద్వారా కార్పొరేట్‌ సంస్థల నుండి నిధులను బలవంతంగా వసూలు చేసేందుకు ఇడి వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించారని, అలాగే క్విడ్‌ ప్రొ కో వంటివి కూడా చోటుచేసుకున్నాయని ప్రాధమిక విశ్లేషణల్లో వెల్లడవుతోందని పొలిట్‌బ్యూరో తెలిపింది.

ప్రజాస్వామ్యం భవితవ్యం పట్ల ఆసక్తి కలిగిన అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులు, వ్యక్తులు అందరూ కూడా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ఇటువంటి దారుణమైన ప్రయత్నాలను నిరసిస్తూ, వీటిని ప్రతిఘటించాలని సిపిఐ(ఎం) కోరింది.

➡️