-ఎల్డిఎఫ్ హయాంలో భారీగా తగ్గిన వైనం
– ఆంధ్రప్రదేశ్లో 4.19 శాతం
– నీతి ఆయోగ్ నివేదిక
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:దేశంలోనే అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. 2022-23లో కేరళ జనాభాలో 0.48 శాతం మంది మాత్రమే పేదలు ఉన్నారు. 2005-06లో కేరళ జనాభాలో 12.31 శాతం మంది పేదలు ఉండగా, అది 0.48 శాతానికి తగ్గింది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వ హయాంలో పేదరికాన్ని తగ్గించేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. దీంతో, పేదరికం గణనీయంగా తగ్గింది. పోషకాహార లభ్యత, శిశు మరణాల రేటు, విద్య, పారిశుధ్యం, విద్యుత్తు, నివాసం, వంట ఇంధనం, బ్యాంకు ఖాతా వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని పేదరిక స్థాయిని నీతి ఆయోగ్ లెక్కించింది. బీహార్ (26.59 శాతం), మేఘాలయ (25.46 శాతం), ఝార్ఖండ్ (37.08 శాతం), ఉత్తరప్రదేశ్ (17.40 శాతం), మధ్యప్రదేశ్ (15.01 శాతం) పేదరికంలో అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 3.76 శాతం పేదలు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 4.19 శాతం ఉన్నారు.