ఐజ్వాల్ : మయన్మార్ శరణార్థులకు కేంద్రం మద్దతుతో తమ ప్రభుత్వం సహాయన్ని కొనసాగిస్తుందని మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమా ప్రకటించారు. మణిపూర్ నిర్వాసితులకు కూడా సాయం అందిస్తామని అన్నారు. శనివారం ఢిల్లీ నుండి తిరిగివచ్చిన అనంతరం మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ” మయన్మార్ జాతీయులకు కేంద్రం శరణార్థి హోదా కల్పించకపోయినప్పటికీ, వారికి సహాయం అందించడంలో మాకు సహకరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే జాతి హింస కారణంగా తమ నివాసాలను విడిచిపెట్టిన మణిపూర్ ప్రజలకు కూడా కేంద్రం సహాయంతో ఆదుకుంటాం” అని అన్నారు.
నివేదిక ప్రకారం.. స్వదేశంలో 2021లో సైనిక తిరుగుబాటు అనంతరం మయన్మార్ నుండి చిన్ కమ్యూనిటీకి చెందిన సుమారు 31,000 మంది మిజోరంలో ఉంటున్నట్లు అధికారిక సమాచారం. మణిపూర్ నుండి సుమారు 9,000 మంది కుకీలు మిజోరాంలో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది.