న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ సబ్ వేరియంట్ జెఎన్-1 మొత్తం 196 కేసులు నమోదయ్యాయి. వేరియంట్ ఉనికిని గుర్తించిన రాష్ట్రాల జాబితాలో ఒడిషా కూడా చేరింది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సబ్ వేరియంట్ ఉనికిని గుర్తించారు. కేరళ (83), గోవా (51), గుజరాత్ (34), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4), తెలంగాణ (2), ఒడిశా (1), ఢిల్లీ (1) నమోదైనట్లు గుర్తించారు. ఇండియాలో కరోనా కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. కొత్తగా 636 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 4,394 కు పెరిగింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ఉదయం 8 గంటలకు నవీకరించిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు కరోనాతో మరణించారు. గత ఏడాది డిసెంబర్ 5 నాటికి.. రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు చేరింది. జలుబు, వైరస్ యొక్క కొత్త రూపం కారణంగా కేసులు మరింతగా పెరిగాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం.. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లు దాటింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం ఉంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో కోవిడ్-19 వ్యతిరేక టీకా ప్రచారం కింద ఇప్పటివరకు 220.67 కోట్ల డోసులు ఇచ్చారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/warient.jpg)