బెంగళూరు : కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లాడ్జి గదిలోకి దుండగులు చొరబడి ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ జంటను దుండగులు అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ఇద్దరినీ చితకబాదారు. ఆ జంటను కొడుతున్నప్పుడు వీడియో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన జనవరి 7వ తేదీన హవేరీ జిల్లాలో జరిగింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో లాడ్జిలో ఉన్న ఈ ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవాళ్లుగా తెలుస్తోంది. హనగల్ తాలుకాలోని లాడ్జిలో ఈ జంట బస చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న మైనారిటి వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తుల గుంపు హౌటల్లోకి ప్రవేశించారు. లాడ్ట్లో ఆ జంట ఉన్న గది వద్దకు వెళ్లి తలుపు తట్టారు. ఓ వ్యక్తి డోర్ తీయడంతో వెంటనే ఆ గుంపు రూమ్లోకి ప్రవేశించి యువతి వద్దకు పరుగెత్తారు. దీంతో మహిళ భయపడి తన ముఖాన్ని బుర్ఖాతో కప్పుకునే ప్రయత్నం చేసింది. అయినా దుండగులు యువతిపై దాడికి పాల్పడ్డారు. ఆమెను తలపై గట్టిగా కొట్టడంతో కిందపడిపోయింది. ఆమెతో ఉన్న వ్యక్తిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా.. అతను రూమ్ నుంచి బయటకు పరుగెత్తడానికి ప్రయత్నించాడు. ఇద్దరు ముగ్గురు దుండగులు అతడ్ని లోపలికి ఈడ్చుకొచ్చి కొట్టారు. అలాగే యువతిపై కూడా పదే పదే దాడికి పాల్పడ్డారు. ఇక లాడ్జి బయట తీసిన మరో వీడియోలో యువతి బుర్ఖాతో ముఖాన్ని కప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. దుండగులు ఆమె హిజాబ్ను తొలగించి వీడియో తీశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.ఈ దాడిలో గాయాలపాలైన జంట హనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన ఆరుగురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే యువతి యువకుల మతాలు వేరుకావడం కారణంగానే దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మతాంతార వివాహం చేసుకున్న జంటగా భావించి బెలగావిలో ఇద్దరిని కొంతమంది దారుణంగా కొట్టిన సంగతి తెలిసిందే. వీరు భిన్న మతాలకు చెందిన యువతి, యువకుడు పక్క పక్కన కూర్చున్నారనే కారణంతో దాడి చేశారు. తనని విడిచిపెట్టమని యువకుడిని కోరినా.. అతన్ని పైపులు, రాడ్లతో చితక బాదారు. యువతిని వేధించారు. బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే మరో ఉదంతం వెలుగుచూడటం గమనార్హం.