మన జీవితాలను కష్టతరం చేస్తుంది
ప్రజలు దీనిని ప్రతిఘటించాలి
కర్నాటక సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు : భారత రాజ్యాంగానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా, దానితో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయనీ, అలాంటి బెదిరింపులను సమాజం ప్రతిఘటించాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. బెంగళూరులో శనివారం జరిగిన రాజ్యాంగం, జాతీయ ఐక్యత సదస్సు 2024 ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. ”రాజ్యాంగం దళితుల అభ్యున్నతి కోసమే రూపొందించబడిందనీ, దేశ సామాజిక ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా లేదని దేశంలో ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని సూచించే రాజ్యాంగంలోని మూల విలువలకు విరుద్ధమని మనం అర్థం చేసుకోవాలి” అని సిద్ధరామయ్య అన్నారు. ”కాబట్టి, మనం ప్రతిఘటించాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి బెదిరింపులకు వ్యతిరేకంగా నిలబడాలి. దానిని రక్షించుకోవటం ద్వారా మనం మనుగడ సాగించాలి. లేకుంటే రాజ్యాంగానికి ముప్పు వాటిల్లటం మన జీవితాలను కష్టతరం చేస్తుంది” అని సీఎం అన్నారు.