- 11 మంది మావోయిస్టుల కాల్చివేత
రాయ్ పూర్ : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులను వేటాడుతున్న కేంద్ర బలగాలు మంగళవారం మరో భారీ ఎన్కౌంటర్కు పాల్పడ్డాయి. నారాయణ్పూర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 11 మంది మావోయిస్టులు చనిపోయారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఈ ప్రాంత ఐజి సుందరరాజ్ తెలిపారు. ఖొకామెటా పోలీసుస్టేషన్ పరిధిలోని ధనంది-కుర్రేవాయ అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో తాము ఎదురుకాల్పులు జరిపామని పోలీస్ అధికారులు తెలిపారు. జిల్లా రిజర్వ్్ గార్డులు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్, సరిహద్దు భద్రతా బలగాలు, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.