న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గతంలో కోర్టు ఆవరణలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను బలవంతంగా లాక్కెళ్లింది కూడా ఆ పోలీస్ అధికారేనని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈమేరకు ఆయన తన భద్రతా వలయంలోని సిబ్బంది నుంచి ఆ అధికారిని తొలగించాలని ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అప్లికేషన్లో కేజ్రీవాల్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే ఈడీ సిబ్బంది తనతో మర్యాదగానే ప్రవర్తించారని ఆయన వెల్లడించారు. లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన కేజ్రీవాల్ రిమాండ్ దరఖాస్తుపై విచారణ నిమిత్తం శుక్రవారం కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలోనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకె సింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించారని కేజ్రీవాల్ దరఖాస్తులో పేర్కొన్నారు. గతేడాది ఇదే కోర్టు ఆవరణలో విలేకరులు సిసోడియను ప్రశ్నిస్తుంటే ఎకె సింగ్ తన మెడ పట్టుకుని బలవంతంగా నెట్టారు. దీనిపై సిసోడియా ఎకె సింగ్పై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎకెసింగ్ చర్యను ఢిల్లీ పోలీసులు సమర్థించారు. పైగా నిందితులు మీడియాతో మాట్లాడడం తప్పు అని సిసోడియా చర్యనే ఢిల్లీ పోలీసులు తప్పుపట్టారు. అయితే ఈ విషయంపై ”మనీశ్జీతో ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా? లేదంటే ఇలా చేయమని పోలీసులను ఎవరైనా ఆదేశిస్తున్నారా?” అంటూ కేంద్రంపై పరోక్షంగా కేజ్రీవాల్ మండిపడిన సంగతి తెలిసిందే.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం రాత్రి అరెస్టయ్యారు. ఈయనను ఇడి అధికారులు శుక్రవారం ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కేజ్రీవాల్ను ఈడీకి ఏడురోజులపాటు కస్టడీకి కోర్టు మంజూరు చేసింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు అనంతరం ఆప్ ఎమ్మెల్యే గులాబీ సింగ్ నివాసంలో ఐటి శాఖ అధికారులు శనివారం సోదాలు నిర్వహిస్తున్నారు.